Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
CI: సహాయం కోరితే సహజీవనం చేశాడు.. మహిళ జీవితంతో ఆడుకున్న సీఐ..

CI: సహాయం కోరితే సహజీవనం చేశాడు.. మహిళ జీవితంతో ఆడుకున్న సీఐ..

NTV Telugu 5 days ago

కేసులో న్యాయం చేయాలని కోరిన మహిళను చేరదీశాడు.. ఆమెను బెదిరించి సహజీవనం చేశాడు.. రెండుసార్లు అబార్షన్ చేయించాడు.. పెళ్లి చేసుకోవాలని అడిగితే..

కాదు పొమ్మన్నాడు.. ఇదీ ఖమ్మం జిల్లాలో ఓ సీఐ చేసిన నిర్వాకం. ఫిర్యాదు చేద్దామని వెళ్లినా పోలీసులు పట్టించుకోవడం లేదని మహిళ ఆరోపిస్తోంది. పోలీస్ శాఖలో తన పలుకుబడి ఉపయోగించి.. ఆ కీచక సీఐ కేసు కాకుండా చూస్తున్నాడనే విమర్శలు వినిపిస్తున్నాయి.

ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి పేరు రాజు నాయక్. ప్రస్తుతం ఖమ్మం జిల్లా సీసీఎస్ పోలీస్ స్టేషన్‌లో సీఐగా పని చేస్తున్నాడు. వృత్తిరీత్యా ప్రజలకు రక్షణ కల్పించాల్సిన ఈయన.. ఓ మహిళపట్ల కీచకుడిగా మారాడు. తన భర్తతో ఉన్న కుటుంబ కలహాల దృష్ట్యా.. సాయం చేయాలని వేడుకున్న ఆ మహిళను ట్రాప్ చేశాడు. ఫోన్ నంబర్ తీసుకుని.. సాయం చేసినట్లు నటిస్తూనే ఆమెను తన ఉచ్చులోకి లాగాడు. 2023లో ఖమ్మం మహిళా పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వర్తించిన సమయంలో ఈ ఘటన జరిగింది. అప్పటి నుంచి ఆమెను వేధించి.. వెంటాడిన సీఐ రాజునాయక్..ఎట్టకేలకు ఆమెతో సహజీవనం చేయడం ప్రారంభించాడు. ఇందులో భాగంగా ఆమె రెండుసార్లు గర్భం దాల్చింది. రెండుసార్లు కూడా ఆమెకు అబార్షన్ చేయించాడు.

అంతేకాదు.. ఆ మహిళ కాపురాన్ని సెట్ చేస్తానని చెప్పిన సీఐ రాజు నాయక్ నిర్వాకాలు మామూలుగా లేవు. ఆమెకు ఆమె భర్తతో విడాకులు ఇప్పించాడు. అందుకోసం లాయర్‌ను కూడా తానే మాట్లాడాడు. మధ్యలో ప్రమోషన్ కోసం డబ్బులు అవసరమైతే.. తన నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు కూడా తీసుకున్నాడని మహిళ ఆరోపిస్తోంది. అంతేకాదు.. తనకు ఇద్దరు పిల్లలు ఉన్నారని.. తనను వదిలేయాలని వేడుకున్నా వదిలిపెట్టలేదు. పోనీ పెళ్లి చేసుకోవాలని కోరితే.. ముఖం చాటేశాడు. అంటే.. అటు వదిలి పెట్టడు.. ఇటు పెళ్లి చేసుకోడు.. తన జీవితం అన్యాయం అయ్యేలా ప్రవర్తించాడని మహిళ ఆరోపిస్తోంది.

మానసికంగా వేధిస్తున్న సీఐ రాజు నాయక్‌పై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు మహిళ ప్రయత్నించింది. మే 7న ఖమ్మం టూ టౌన్ పోలీస్ స్టేషన్‌కు వెళితే.. కేసు తీసుకోలేదని.. పోలీసులు తన ఆవేదనను పట్టించుకోవడం లేదని ఆమె ఆరోపించింది. ఐతే అప్పటికే ఫిర్యాదు గురించి తెలుసుకున్న రాజు నాయక్.. పోలీస్ శాఖలో తన పలుకుబడి ఉపయోగించాడు. కేసు నమోదు కాకుండా చూసుకున్నాడు. అంతే కాదు.. అప్పటికే ముందస్తు బెయిల్ కూడా తెచ్చుకున్నాడు. ఈ క్రమంలో పోలీస్ ఉన్నతాధికారులు అతన్ని ఐజీ కార్యాలయానికి అటాచ్ చేశారు. మరోవైపు తనకు న్యాయం చేయాలని మహిళ ఉన్నతాధికారులను వేడుకుంటోంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ntvtelugu