దేశ రాజధాని ఢిల్లీలో భారీ వర్షం కురుస్తోంది. ఉరుములతో కూడిన వర్షం హడలెత్తించింది. దీంతో నగరంలో వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. సాయంత్రం పూట అకస్మాత్తుగా కురవడంతో ఉద్యోగస్థులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
ఇక విమాన రాకపోకల్లో కూడా తీవ్ర అంతరాయం ఏర్పడింది.
గత కొద్దిరోజులుగా ఎండలతో ఢిల్లీ నగరం హీటెక్కిపోయింది. ఉక్కపోత, వడగాల్పులతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఇలాంటి తరుణంలో హఠాత్తుగా వర్షం కురవడంతో హస్తిన చల్లబడింది. వాతావరణం ఆహ్లాదకరంగా మారింది. ప్రజలు ఉల్లాసంగా గడుపుతున్నారు. ఉక్కపోత నుంచి నగర ప్రజలు ఉపశమనం పొందుతున్నారు.
ఐఎండి ప్రకారం.. రాబోయే 2-3 రోజుల్లో ఉరుములతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉంది. వడగాలులు కూడా తగ్గుముఖం పట్టనున్నాయి. వాయువ్య భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో వడగాలుల తీవ్రత ఈ రోజు నుంచి తగ్గడం ప్రారంభం కావచ్చని పేర్కొంది. ఇక రాజస్థాన్, విదర్భ, తూర్పు మధ్యప్రదేశ్లోని కొన్ని ప్రాంతాల్లో వడగాలుల పరిస్థితులు కొనసాగినప్పటికీ .. రేపటి నుంచి అవి గణనీయంగా తగ్గుతాయని అంచనా.
తుఫాను హెచ్చరిక
మే 28 నుంచి 31 మధ్య ఉత్తర, మధ్య, తూర్పు భారతదేశాల్లో ఉరుములతో కూడిన వర్షాలు, బలమైన గాలులు వీస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఢిల్లీ-ఎన్సిఆర్తో సహా అనేక ప్రాంతాల్లో ధూళి తుఫానులు, తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
రాబోయే 3-4 రోజుల్లో ఉత్తర భారతదేశంలోని చాలా రాష్ట్రాల్లో వాతావరణంలో మార్పు వచ్చి.. వర్షపాతం పెరుగుతుందని వాతావరణ శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. దీనివల్ల ఉష్ణోగ్రతలు తగ్గి.. ఎండల నుంచి ఉపశమనం లభిస్తుంది.

