Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Explainer: పాక్ కొత్త పొత్తులు, పాత కక్షలు.. దాయాది దారి ఎటు?

Explainer: పాక్ కొత్త పొత్తులు, పాత కక్షలు.. దాయాది దారి ఎటు?

NTV Telugu 12 hrs ago

స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి పాకిస్తాన్ విదేశాంగ విధానం ఒకే బిందువు చుట్టూ తిరుగుతోంది. అదే 'భారత వ్యతిరేకత'. భారత్‌ను ఎలాగైనా బలహీనపరచాలనే ఏకైక లక్ష్యంతో ఆ దేశ పాలకులు దశాబ్దాలుగా ఎవరితోనైనా చేతులు కలపడానికి, ఏ రకమైన కుట్రకైనా సిద్ధపడటానికి వెనుకాడలేదు.

అయితే, మారుతున్న కాలంతో పాటు అంతర్జాతీయ రాజకీయాల్లో సమీకరణాలు మారుతున్నప్పటికీ, పాకిస్తాన్ ఆలోచనా విధానంలో మాత్రం మార్పు రాలేదు. తాజాగా సౌదీ అరేబియా, టర్కీలతో కుదుర్చుకుంటున్న నాటో తరహా రక్షణ ఒప్పందాల నేపథ్యంలో, రాబోయే రోజుల్లో పాక్ వైఖరి ఎలా ఉండబోతోంది? ఆ దేశ భవిష్యత్తు ఏమిటి? అనే ప్రశ్నలకు సమాధానాలు వెతకాల్సిన సమయం ఆసన్నమైంది.

బీజేపీ జాతీయవాద ప్రభుత్వం – కయ్యానికి కాలుదువ్వే అవకాశాలుంటాయా?

ప్రస్తుతం భారతదేశంలో నరేంద్ర మోదీ నేతృత్వంలో బలమైన, దూకుడుగా వ్యవహరించే జాతీయవాద బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉంది. గతంలో సర్జికల్ స్ట్రైక్స్, బాలాకోట్ వైమానిక దాడుల ద్వారా భారత్ తన ఉగ్రవాద వ్యతిరేక వైఖరిని స్పష్టంగా చాటిచెప్పింది. ఈ నేపథ్యంలో, సౌదీ-టర్కీల అండదండలు లభించాయనే అతివిశ్వాసంతో పాకిస్తాన్ మళ్లీ కయ్యానికి కాలుదువ్వే ప్రమాదం లేకపోలేదు. కానీ, సరిహద్దుల వెంబడి ఎలాంటి దుస్సాహసానికి ఒడిగట్టినా, దానికి భారత్ నుంచి గతంలో కంటే వంద రెట్లు బలమైన బదులు ఉంటుందన్న కఠిన వాస్తవం పాకిస్తాన్‌కు తెలుసు. అందువల్ల కేవలం మిలటరీ సాహసాల కంటే, దౌత్యపరమైన వేదికలపై భారత్‌ను ఇరుకున పెట్టే ప్రయత్నాలకే ఆ దేశం ప్రాధాన్యతనిచ్చే అవకాశం ఉంది.

ఆర్థిక ఎదుగుదలకై మిత్రుల మద్దతా? లేక పాత కక్షలేనా?

పాకిస్తాన్ ప్రస్తుతం ఎదుర్కొంటున్న అత్యంత భయంకరమైన సమస్య దివాళా కోరుతనం. విదేశీ మారకద్రవ్య నిల్వలు అడుగంటిపోయి, అంతర్జాతీయ సంస్థల (IMF) రుణాలపై బతుకుతున్న దయనీయ స్థితిలో ఆ దేశం ఉంది. ఈ తరుణంలో సౌదీ అరేబియా, టర్కీల మద్దతును పాకిస్తాన్ తన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టుకోవడానికి, విదేశీ పెట్టుబడులను ఆకర్షించడానికి ఉపయోగించుకోవాలి. నిజానికి ఆ దేశం చేయాల్సింది అదే. కానీ, పాలకుల ప్రాధాన్యతలు మాత్రం ఇప్పటికీ భారత్‌ను దెబ్బతీయడంపైనే ఉంటున్నాయి. ఆర్థిక పురోగతిని పక్కనపెట్టి, మళ్లీ పాత కక్షల కోసం పొత్తులను వాడుకుంటే పాకిస్తాన్ పతనం మరింత వేగవంతం అవుతుంది.

భారత్ నాశనమే లక్ష్యమైతే పాకిస్తాన్ ఏనాడైనా ఎదుగుతుందా?

“అభివృద్ధిని కోరుకునే దేశం విజయం సాధిస్తుంది, విధ్వంసాన్ని కోరుకునే దేశం వినాశనాన్ని మూటగట్టుకుంటుంది.” పాకిస్తాన్ విషయంలో ఇదే జరుగుతోంది. కేవలం భారత్ నాశనమే పరమావధిగా సాగే ఏ దేశమైనా ఆర్థికంగా, సాంకేతికంగా ఎప్పటికీ ఎదగలేదు. ఇందుకు పాకిస్తాన్ ప్రస్తుత అంతర్గత పరిస్థితే ప్రత్యక్ష ఉదాహరణ.

ఇవాళ పాకిస్తాన్ సామాన్య ప్రజలలోనూ ఒక స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. పక్కనే ఉన్న భారతదేశం చంద్రుడిపైకి వెళ్తుంటే, డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో దూసుకెళ్తుంటే… తమ దేశం మాత్రం గోధుమ పిండి కోసం, కరెంటు కోతల కోసం కొట్టుమిట్టాడుతున్న దయనీయ స్థితిని ప్రజలు బేరీజు వేసుకుంటున్నారు.

అంతర్గతంగా కరుగుతున్న పునాదులు:

పాకిస్తాన్ పతనం వెనుక కేవలం ఆర్థిక దివాళా మాత్రమే కాదు, అంతర్గత తిరుగుబాట్లు కూడా ప్రధాన కారణమే. బెలూచిస్తాన్ అశాంతి రాజ్యమేలుతోంది. బెలూచ్ ప్రజలు దశాబ్దాలుగా పాకిస్తాన్ ప్రభుత్వ అణచివేతకు వ్యతిరేకంగా సాయుధ పోరాటం చేస్తున్నారు. ఇక ఆక్రమిత కాశ్మీర్‌ ప్రజల గురించి తెలిసిందే. వారిని పాక్‌ పాలకులు రెండవ తరగతి పౌరులుగా చూస్తుంది. అందుకే పీఓకే ప్రజలు పాక్ ప్రభుత్వ దోపిడీ విధానాలపై, పన్నుల భారాలపై రోడ్డెక్కి తిరుగుబాటు చేస్తున్నారు. తమ దేశ ప్రజల కనీస అవసరాలను తీర్చలేక, ప్రాథమిక హక్కులను కాలరాస్తున్న పాకిస్తాన్ పాలకులకు, భారత్‌ను బలహీనపరచాలనే పిచ్చి ఆలోచన మానితే తప్ప దేశం ముక్కలు కాకుండా కాపాడుకోవడం అసాధ్యం.

పాకిస్తాన్ ఎంతగా ఎగిరిపడ్డా, కొత్త మిత్రులతో ఎన్ని ఒప్పందాలు చేసుకున్నా… అది కేవలం తాత్కాలిక ఉపశమనం మాత్రమే కాగలదు. పొరుగు దేశం ఎదుగుదలను చూసి ఓర్వలేక, తన వినాశనాన్ని కోరుకునే విధానాన్ని మార్చుకోనంత కాలం పాకిస్తాన్ ఒక విఫల దేశంగానే చరిత్రలో మిగిలిపోతుంది. ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడి ప్రజల సంక్షేమాన్ని కోరుకోవాలా? లేక భారత్ తో కక్ష సాధింపులతో పూర్తిగా సర్వనాశనం కావాలా? అన్నది ఇప్పుడు పాక్ పాలకుల చేతుల్లోనే ఉంది.

:- రమేశ్ (NTV GLOBAL)

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ntvtelugu