Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Explainer: పిడుగులు చంపుతున్నాయ్.. తెలుగు రాష్ట్రాలకు డేంజర్ అలెర్ట్!

Explainer: పిడుగులు చంపుతున్నాయ్.. తెలుగు రాష్ట్రాలకు డేంజర్ అలెర్ట్!

NTV Telugu 6 days ago

Lightning Strikes: రాత్రి 10 గంటలు దాటింది… ఆకాశం మొత్తం నల్లటి మబ్బులతో నిండిపోయింది… గాలి ఒక్కసారిగా భీకరంగా మారింది… గ్రామం చివర పొలంలో పని ముగించుకుని ఇంటికి బయలుదేరిన రైతు ఒక్కసారిగా ఆగిపోయాడు… ఆకాశం చీలిపోయినట్టు తెల్లటి వెలుగు మెరిసింది… ఆ వెలుగుకి కళ్లుమూసుకునేలోపే పిడుగు నేలను తాకింది… ఒక్క క్షణం… అంతే… అక్కడ మనిషి లేడు…మాయమయ్యాడు..

ఈ రాష్ట్రాలే రిస్క్‌లో ఎందుకు?

ఉత్తరప్రదేశ్‌తో పాటు ఆంధ్రప్రదేశ్ ఎందుకు రిస్క్ జోన్‌లో ఉన్నాయో తెలుసుకోవాలి. దీనికి సమాధానం వాతావరణ మార్పుల్లో దాగి ఉంది. భూమి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి… సముద్రాల వేడి పెరుగుతోంది… ముఖ్యంగా బంగాళాఖాతంలో ఉష్ణోగ్రతలు పెరగడంతో గాల్లో తేమ విపరీతంగా పెరుగుతోంది. వేడి గాలి పైకి ఎగురుతుంది… చల్లని గాలి దాన్ని ఢీకొంటుంది. ఈ రెండు గాలుల మధ్య ఏర్పడే భారీ విద్యుత్ ఘర్షణే పిడుగు. మేఘాల మధ్య లక్షల కోట్ల వోల్టుల విద్యుత్ చేరినప్పుడు అది ఒక్కసారిగా భూమిపై పడుతుంది. అదే మెరుపు… అదే పిడుగు…!

ఒక్క డిగ్రీ పెరిగినా అంతేసంగతి:

భూమి ఉష్ణోగ్రత ఒక్క డిగ్రీ పెరిగినా పిడుగుల తీవ్రత 10 నుంచి 12 శాతం వరకు పెరిగే అవకాశం ఉందంటున్నారు సైంటిస్టులు. అడవుల నరికివేత, కాలుష్యం, నగరాల వేడి లాంటి అంశాలు ఆకాశాన్ని మరింత ఆగ్రహంగా మార్చేస్తున్నాయి. మరోవైపు ఉత్తరప్రదేశ్‌ ఎక్కువ ఎఫెక్ట్ అవ్వడానికి కారణం అక్కడ జనాభానే. దేశంలోనే అత్యధిక జనాభా కలిగిన ఈ రాష్ట్రంలో లక్షలాది మంది రైతులు బహిరంగ ప్రదేశాల్లో పనిచేస్తుంటారు. వర్షం మొదలైతే చెట్టు కింద నిలబడటం, పొలాల్లో ఉండిపోవడం కారణంగా ఎక్కువ మంది పిడుగులకు బలవుతున్నారు. బీహార్, జార్ఖండ్ ప్రాంతాల్లో కూడా ఇదే పరిస్థితి. ముఖ్యంగా మాన్సూన్ ముందు వచ్చే ఉరుములు, ఈదురుగాలులతో కూడిన తుఫాన్లు అక్కడ మరింత ప్రమాదకరంగా మారుతున్నాయి.

ఏపీ సంగతేంటి?

ఆంధ్రప్రదేశ్ పరిస్థితి కూడా ఆందోళనకరంగానే ఉంది. సముద్రానికి దగ్గరగా ఉండటం వల్ల తేమ అధికంగా ఉంటుంది. అందుకే కోస్తా జిల్లాల్లో పిడుగులు ఎక్కువగా నమోదవుతున్నాయి. శ్రీకాకుళం, విజయనగరం, నెల్లూరు, ప్రకాశం ప్రాంతాల్లో ప్రమాదం మరింత ఎక్కువగా ఉందని అధికారులు చెబుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ప్రత్యేక లైట్నింగ్ అలర్ట్ సిస్టమ్స్ ఏర్పాటు చేస్తోంది. గ్రామాల్లో రియల్ టైమ్ హెచ్చరికలు ఇచ్చే యంత్రాలను కూడా అమర్చుతోంది. తెలంగాణలో కూడా పరిస్థితి భయంకరంగానే మారుతోంది. ఒక్కరోజులోనే ఎనిమిది మంది చనిపోయిన ఘటనలు కూడా ఇటివల కాలంలో నమోదయ్యాయి. పొలాల్లో పని చేస్తూ, చెట్టు కింద తలదాచుకుంటూ, వర్షం నుంచి తప్పించుకోవాలని ప్రయత్నించే సమయంలోనే చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇక ఈ పిడుగులు కేవలం గ్రామాలకే పరిమితం కావడం లేదు. నగరాల్లో కూడా ప్రమాదం పెరుగుతోంది. భారీ భవనాలు, ఎలక్ట్రిక్ టవర్లు,, కాలుష్యం లాంటి అంశాలు వాతావరణాన్ని ప్రభావితం చేస్తున్నాయి. అందుకే శాస్త్రవేత్తలు దీన్ని సైలెంట్ కిల్లర్ అని పిలుస్తున్నారు. ఎందుకంటే వరద వస్తే కనిపిస్తుంది… తుఫాను వస్తే హెచ్చరిక ఉంటుంది… కానీ పిడుగు… కేవలం ఒక క్షణంలో ప్రాణం తీసేస్తుంది.

అందుకే ఇప్పుడు ప్రతి మనిషి అప్రమత్తంగా ఉండాల్సిన సమయం వచ్చింది. ఉరుములు వినిపిస్తే వెంటనే ఇంట్లోకి వెళ్లాలి. చెట్ల కింద నిలబడకూడదు. పొలాల్లో మొబైల్ ఫోన్లు, ఇనుప వస్తువులతో ఉండకూడదు. ప్రభుత్వం విడుదల చేసే అలర్ట్ యాప్స్ ఉపయోగించాలి. ఎందుకంటే ఒక చిన్న జాగ్రత్త… ఒక కుటుంబాన్ని కాపాడగలదని మర్చిపోవద్దు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ntvtelugu