Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Haryana: ఛీ.. ఛీ.. ఇంత దారుణమా? కూతుళ్ల కోసం జీవితాన్ని ధారబోసిన తండ్రి.. వీడియో కాల్‌లో అంత్యక్రియలు వీక్షించిన కూతుళ్లు!

Haryana: ఛీ.. ఛీ.. ఇంత దారుణమా? కూతుళ్ల కోసం జీవితాన్ని ధారబోసిన తండ్రి.. వీడియో కాల్‌లో అంత్యక్రియలు వీక్షించిన కూతుళ్లు!

NTV Telugu 1 week ago

Haryana: ముగ్గురు కుమార్తెలను ఎంతో ప్రేమగా సాకాడు. వారు సమాజంలో ఉన్నత స్థానాల్లో నిలబడాలని తన జీవితాన్నే ధారపోశాడు. ఎంతో కష్టపడి చదివించాడు..

పెళ్లిళ్లు చేసి ప్రయోజకులను చేశాడు. కానీ, వయోభారం పైబడేసరికి ఆ తండ్రి ఆఖరి శ్వాస విడిచింది మాత్రం ఒక వృద్ధాశ్రమంలో. కనీసం కడసారి చూపుకైనా కన్నపిల్లలు వస్తారేమోనని ఆ వృద్ధుడి కళ్లు కాయలు కాచేలా ఎదురుచూశాయి. కానీ ఆ కూతుళ్లకు సమయం దొరకలేదు. చివరికి ఆ కుమార్తెలు వీడియో కాల్‌లో ఆ తండ్రి అంత్యక్రియలను వీక్షించాల్సి వచ్చింది. హర్యానా రాష్ట్రం సోనెపట్‌లోని వెస్ట్ రామ్ నగర్‌లో ఉన్న సమాజ్ కళ్యాణ్ శిక్షా సమితి వృద్ధాశ్రమంలో చోటుచేసుకున్న ఈ ఉదంతం, నేటి సమాజంలో మారుతున్న మానవ సంబంధాలకు, కనుమరుగవుతున్న అనుబంధాలకు అద్దం పడుతోంది.

ఒకప్పుడు ముంబైలో జౌళి వ్యాపారిగా స్థిరపడిన శివచరణ్ రామ్ రతన్ గుప్తాకు కొడుకులు లేరు. ముగ్గురు కుమార్తెలే ఆయన ప్రపంచం. వారి చదువు, భవిష్యత్తు కోసం ఆయన తన జీవితాన్ని ధారపోశారు. పెద్ద కుమార్తె అనితను ఉపాధ్యాయురాలిగా తీర్చిదిద్దగా.. ఆమె ప్రస్తుతం నేపాల్‌లో స్థిరపడింది. రెండో కుమార్తె నిషా ఉత్తరప్రదేశ్‌లోని అజమ్‌గఢ్‌లో, మూడో కుమార్తె ప్రియ ముంబైలో ఉంటున్నారు. ముగ్గురికీ పెళ్లిళ్లయి తమ తమ కుటుంబాలతో బిజీగా ఉన్నారు. కొన్నేళ్ల కిందట భార్య మీనాతో కలిసి శివచరణ్ సోనెపట్‌లోని వృద్ధాశ్రమానికి వచ్చారు. కొంతకాలానికే భార్య కన్నుమూసింది. అప్పటినుంచి ఆశ్రమంలోనే ఒంటరిగా ఉంటున్న శివచరణ్.. వద్ద ఉన్న చిన్న ఫోన్ ద్వారా కుమార్తెలతో తరచూ మాట్లాడేవారు. అయితే, ఆయన ఆరోగ్యం క్షీణించడం ప్రారంభమయ్యాక కుమార్తెల నుంచి పిలుపులు తగ్గిపోయాయి.

తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న శివచరణ్ పరిస్థితి విషమంగా ఉందంటూ ఆశ్రమ నిర్వాహకుడు ఆనంద్ కుమార్.. దాదాపు 20 రోజుల ముందే కుమార్తెలకు సమాచారం అందించారు. అయినా, ఏ ఒక్కరూ తండ్రిని చూడటానికి రాకపోవడం గమనార్హం. చివరికి మంగళవారం తెల్లవారుజామున 3:30 గంటలకు ఆ వృద్ధుడి గుండె ఆగిపోయింది. తండ్రి మరణవార్త వినిపించినా కుమార్తెల నుంచి ఆశించిన స్పందన రాలేదు. సోనెపట్ వరకు రావడానికి తమకు సమయం లేదని వారు నిర్మొహమాటంగా చెప్పేశారు. అంత్యక్రియలు జరిపించడానికి అనిత అనే కుమార్తె ఆన్‌లైన్‌లో రూ. 5,100 పంపి, కార్యక్రమాలు సరిగ్గా పూర్తి చేయాలని కోరింది.

చివరికి, ఆశ్రమ నిర్వాహకులు, స్థానిక ప్రజల సాయంతో శివచరణ్ అంత్యక్రియలు నిర్వహించారు. నేపాల్, ఉత్తరప్రదేశ్, ముంబైల నుంచి ఆ ముగ్గురు కుమార్తెలు స్మార్ట్‌ఫోన్లలో వీడియో కాల్ ద్వారా తండ్రి కడసారి పయనాన్ని చూశారు. అంతిమ సంస్కారాలు పూర్తయ్యాక, ఆ వీడియోలను తమకు పంపాల్సిందిగా ఆశ్రమాన్ని కోరడం గమనార్హం. అస్తికలను కూడా తీసుకెళ్లడానికి కుదరదని చెప్పడంతో.. నిర్వాహకులే వాటిని గంగలో కలిపేందుకు ఏర్పాట్లు చేశారు. కన్నపిల్లలు దరిచేరకపోయినా, శివచరణ్ మాత్రం మరణంలోనూ తన ఉదారతను చాటుకున్నారు. కుటుంబసభ్యుల సమ్మతితో ఆయన నేత్రాలను దానం చేశారు. తాను కన్నుమూసినా.. మరొకరి జీవితంలో వెలుగులు నింపాలన్న ఆయన ఆఖరి కోరిక నెరవేరింది. చదివించి, ప్రయోజకులను చేసిన తండ్రికి చివరి వీడ్కోలు చెప్పడానికి సమయం లేదన్న ఆ కూతుళ్ల సమాధానం.. సాంకేతికత పెరిగినా మానవత్వంలో వస్తున్న క్షీణతకు నిదర్శనంగా నిలిచింది. కన్నవారిని కాదనుకుని సంపాదించే ఆస్తులు, హోదాలు నిజంగా ఆనందాన్ని ఇస్తాయా? అన్న ప్రశ్నను ఈ ఉదంతం ప్రతి ఒక్కరి గుండెల్లో రగిలిస్తోంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ntvtelugu