కాంగ్రెస్ పార్టీలో విషాదం చోటు చేసుకుంది. ఆ పార్టీ సీనియర్ నేత అహ్మద్ పటేల్ కరోనా చికిత్స పొందుతూ ఇవాళ ఉదయం మృతి చెందారు. గురుగావ్లోని వేదాంత ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. ఇవాళ ఉదయం 3:30 గంటలకు అహ్మద్ పటేల్ మృతి చెందారని ఆయన కుమారుడు ఫైసల్ పటేల్ ట్విట్టర్ వేదికగా తెలిపారు. అహ్మద్ పటేల్ కు నెల రోజుల క్రితం కరోనా వైరస్ సోకింది. గత కొద్ది రోజులుగా ఆయన శరీరంలోని పలు అవయవాలు సవ్యంగా పనిచేయకపోవడంతో ఆరోగ్యం మరింతగా క్షీణించిందని కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ నెల 15 నుంచి అహ్మద్ పటేల్ ఐసీయూలో చికిత్స పొందుతున్నట్లు వారు వెల్లడించారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి ఆయన సుదీర్ఘ కాలం రాజకీయ సలహాదారులుగా పనిచేశారు.
2004, 2009 కాంగ్రెస్ విజయంలో ఆయన కీలకపాత్ర వహించారు.

