Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Karnataka: త్వరలో కాంగ్రెస్ హైకమాండ్ భేటీ.. తేల్చేయనున్న కర్ణాటక పంచాయితీ!

Karnataka: త్వరలో కాంగ్రెస్ హైకమాండ్ భేటీ.. తేల్చేయనున్న కర్ణాటక పంచాయితీ!

NTV Telugu 3 days ago

కేరళం ఎన్నికల ఫలితాలు వెలువడిన 10 రోజుల తర్వాత ముఖ్యమంత్రి పంచాయితీని కాంగ్రెస్ అధిష్టానం పరిష్కరించింది. అసమ్మతి లేకుండా చాకచక్యంగా చక్కదిద్దింది.

కానీ కర్ణాటక పంచాయితీని మాత్రం ఇప్పటి వరకు పరిష్కరించలేకపోయింది. ముఖ్యమంత్రి పీఠంపై డీకే.శివకుమార్ ఎప్పుటి నుంచో ఆశలు పెట్టుకున్నారు. కానీ సిద్ధరామయ్య మాత్రం ఆ పీఠాన్ని వదులుకునేందుకు మాత్రం సిద్ధంగా ఉన్నట్లు కనిపించడం లేదు. దీంతో డీకే.శివకుమార్ ఆశలు.. అడియాశలే అవుతూనే ఉన్నాయి. అయితే ఈసారి తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధమవుతున్నట్లు సంకేతాలు వస్తున్నాయి.

అయితే కేరళం పంచాయితీని పరిష్కరించినట్లుగానే కర్ణాటక సమస్యను పరిష్కరించాలని డీకే.శివకుమార్ మద్దతుదారులు డిమాండ్ చేస్తు్న్నారు. ఈ నేపథ్యంలో మరోసారి ఈ వ్యవహారం హాట్ టాఫిక్‌గా మారింది. ఈనెలాఖరులోపు కాంగ్రెస్ హైకమాండ్ సమావేశం కాబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ముఖ్యమంత్రి అంశాన్ని తేల్చేయవచ్చని వార్తలు కూడా వస్తున్నాయి.

కర్ణాటకకు సంబంధించిన అన్ని విషయాలను పరిష్కరించడానికి కాంగ్రెస్ హైకమాండ్ మే నెలాఖరులోగా ఒక కీలక సమావేశం నిర్వహించే అవకాశం ఉందని వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. భవిష్యత్ వ్యూహంపై చర్చించేందుకు ముఖ్యమంత్రి సిద్దరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌లను ఢిల్లీకి పిలిపించవచ్చని సమాచారం. సిద్ధరామయ్య దాదాపు ఆరు నెలలుగా మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణకు పార్టీ నాయకత్వం అనుమతి కోసం ఎదురుచూస్తున్నారు. బుధవారంతో సిద్ధరామయ్య ప్రభుత్వం ఏర్పడి మూడేళ్లు పూర్తవుతోంది. ఈ నేపథ్యంలో మరోసారి సీఎం పంచాయితీ తెరపైకి వచ్చింది.

ఇక ముఖ్యమంత్రి పదవిపై డీకే శివకుమార్, కొత్తగా హోం మంత్రి జి. పరమేశ్వర ఆశలు పెట్టుకున్నారు. ప్రస్తుతం వీరిద్దరి మధ్య పోటీ నెలకొన్నట్లుగా తెలుస్తోంది. గత నవంబర్‌లో సిద్దరామయ్య ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నర సంవత్సరాలు పూర్తయినప్పుడు డీకే శివకుమార్ 'రెండున్నర సంవత్సరాల ఫార్ములా' ఆధారంగా ముఖ్యమంత్రి పదవి కోసం ఒత్తిడి చేయడం ప్రారంభించారు. అయితే కాంగ్రెస్ నాయకత్వం జోక్యం చేసుకుని వర్గపోరాటాన్ని అణచివేసింది. ముఖ్యమంత్రి పదవి దక్కకపోవడంతో డీకే శివకుమార్ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణను కూడా అడ్డుకున్నారు.

అయితే కేరళం, తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల తర్వాత కర్ణాటక విషయంపై నిర్ణయం తీసుకుంటారని అప్పట్లో వర్గాలు తెలిపాయి. ఇప్పుడు ఆ సమయం రానే వచ్చింది. ఒకవైపు ప్రభుత్వం ఏర్పడి మూడేళ్లు పూర్తయింది. మరోవైపు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ప్రాతినిధ్యం వహిస్తున్న స్థానంతో సహా కర్ణాటక నుంచి మూడు రాజ్యసభ స్థానాలు జూన్‌లో ఖాళీ కానున్నాయి. అంతేకాకుండా రాబోయే రెండు నెలల్లో కర్ణాటక శాసన మండలిలోని సుమారు తొమ్మిది స్థానాలు కూడా కాంగ్రెస్ పార్టీ ఖాతాలోకి వెళ్లే అవకాశం ఉంది. అన్ని నిర్ణయాలు ఢిల్లీ నుంచే తీసుకోవాల్సిన అవసరం ఉంది.

అయితే కర్ణాటకలో ముఖ్యమంత్రి మార్పుపై కాంగ్రెస్ చర్చిస్తుందా లేదా అన్నదే అతిపెద్ద ప్రశ్న. ఇది జరిగే అవకాశం లేదని వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం 79 ఏళ్ల వయసులో ఉన్న సిద్దరామయ్యకు వయసు పైబడుతుండటంతో ఆయన నాయకత్వంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడానికి కాంగ్రెస్ సుముఖంగా లేదని ఆ వర్గాలు అంటున్నాయి. అయినప్పటికీ వెనుకబడిన కులాలు, దళితులు, గిరిజన వర్గాల్లో ప్రజాదరణ పొందిన సిద్దరామయ్యకు పెద్ద సంఖ్యలో ఎమ్మెల్యేల మద్దతు కూడా ఉంది. దీంతో ముఖ్యమంత్రి మార్పుపై కాంగ్రెస్ అధిష్టానం తర్జన భర్జన పడుతున్నట్లుగా తెలుస్తోంది. కేరళం మాదిరిగా పరిష్కరిస్తుందా? వాయిదా వేస్తుందా? అనేది సందిగ్ధంగా ఉంది.

2023 మేలో కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పుడు.. రెండున్నరేళ్ల రొటేషన్ పద్ధతిలో అంటే సగం పదవీకాలానికి ముఖ్యమంత్రి పదవి ఇస్తామని తనకు హామీ ఇచ్చారని డీకే శివకుమార్‌ చెబుతున్నారు. మరోవైపు దళిత వర్గానికి చెందిన హోం మంత్రి జి. పరమేశ్వరను ముఖ్యమంత్రిగా నియమించాలని ఆయన మద్దతుదారులు డిమాండ్ చేస్తూనే ఉన్నారు. కర్ణాటకకు ఇప్పటివరకు దళిత ముఖ్యమంత్రి ఎవరూ లేరు. ముఖ్యమంత్రి పదవి సమస్య కారణంగా ఆరు నెలలుగా మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ నిలిచిపోయింది. సిద్దరామయ్య ప్రభుత్వంలోని సగానికి పైగా మంత్రులను మార్చనున్నారని వర్గాలు చెబుతున్నాయి. కొన్ని వారాల క్రితం మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ కోరుతూ కర్ణాటకకు చెందిన సుమారు డజను మంది ఎమ్మెల్యేలు ఢిల్లీలో మకాం వేశారు. వర్గాల సమాచారం ప్రకారం.. కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే, ఆర్గనైజేషన్ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్, ఇన్‌చార్జ్ రణదీప్ సుర్జేవాలా మొదట సిద్దరామయ్య, డీకే శివకుమార్‌లతో సమావేశమవుతారు. తుది నిర్ణయం రాహుల్ గాంధీ చేతిలోకి వెళ్లింది. కేరళం తర్వాత మరో రాజకీయ సమస్యను పరిష్కరించే బాధ్యత ఆయనపై ఉంచారు. ఏం చేయబోతున్నారో సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ntvtelugu