కేరళం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చిన 10 రోజుల తర్వాత ముఖ్యమంత్రి సందిగ్ధం వీడింది. గురువారం వీడీ.సతీశన్ను ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ హైకమాండ్ ఎంపిక చేసింది.
అనంతరం సీఎల్పీ లీడర్గా ఎమ్మెల్యేలు ఎన్నుకున్నారు. సాయంత్రం గవర్నర్ రాజేంద్ర అర్లేకర్ను సతీశన్ కలిశారు. ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఆహ్వానించాలని కోరగా.. అందుకు గవర్నర్ ఆహ్వానించినట్లుగా లోక్భవన్ తెలిపింది. ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు కాంగ్రెస్కు బలం ఉండడంతో గవర్నర్ వెంటనే ఆమోదించినట్లుగా తెలుస్తోంది.
ఇక కేరళం రాష్ట్రానికి 13వ ముఖ్యమంత్రిగా సతీశన్ ఈనెల 18న ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పెద్దలు మల్లిఖార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంకాగాంధీ, కాంగ్రెస్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరుకానున్నారు.
140 సభ్యులున్న కేరళం అసెంబ్లీలో యూడీఎఫ్ కూటమి 102 స్థానాలు గెలుచుకుని ఘన విజయం సాధించింది. కాంగ్రెస్ పార్టీ 63 స్థానాలు దక్కించుకోగా.. ముస్లిం లీగ్ 22 స్థానాలు, కేరళ కాంగ్రెస్ 8 స్థానాలు, విప్లవ సోషలిస్టు పార్టీ 3 స్థానాలు గెలుచుకున్నాయి. తొలుత ముఖ్యమంత్రి రేసులో కేసీ.వేణుగోపాల్ పేరు ప్రముఖంగా వినిపించింది. అనంతరం సతీశన్, రమేష్ చెన్నితాల పేర్లు తెరపైకి రావడంతో పార్టీలో వర్గపోరు మొదలైంది. చివరికి సతీశన్కు ముఖ్యమంత్రి పదవి దక్కింది.

