Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Kishan Reddy : మజ్లిస్ ను ప్రసన్నం చేసుకునే ప్రయత్నంలో రేవంత్ ప్రభుత్వం

Kishan Reddy : మజ్లిస్ ను ప్రసన్నం చేసుకునే ప్రయత్నంలో రేవంత్ ప్రభుత్వం

NTV Telugu 1 week ago

Kishan Reddy : హైదరాబాద్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

రేవంత్ రెడ్డి సర్కారుకు మజ్లిస్ పార్టీ (AIMIM) అంటే భయమా, ప్రేమా లేక రెండూ ఉన్నాయా అని ఆయన ప్రశ్నించారు. భూములు, రియల్ ఎస్టేట్ వ్యవహారాల్లో కమీషన్ల కోసం ఆరాటపడుతున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం.. ఇందుకోసం సామాన్య ప్రజల జీవనోపాధిని బలిచేస్తోందని ఆరోపించారు. అదే సమయంలో మజ్లిస్ పార్టీ అగ్రనేతల ప్రయోజనాలను కాపాడేందుకు ఈ ప్రభుత్వం ఎంత దూరమైనా వెళ్లేందుకు వెనుకాడటం లేదని మండిపడ్డారు.

పక్షపాత పాలనకు 'హైడ్రా' ఒక ఉదాహరణ

రేవంత్ సర్కార్ సాగిస్తున్న సెలక్టివ్ గవర్నెన్స్ (పక్షపాత పాలన)కు హైడ్రా (HYDRAA) చర్యలే ప్రత్యక్ష ఉదాహరణ అని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. సామాన్య ప్రజల ఇళ్లు, నిర్మాణాల విషయంలో మాత్రం మెరుపు వేగంతో నిర్ణయాలు తీసుకుంటూ, కఠినంగా బుల్డోజర్లతో వ్యవహరిస్తున్న ప్రభుత్వం.. ఒవైసీ కుటుంబానికి చెందిన బారిష్టర్ ఫాతిమా ఓవైసీ ఎడ్యుకేషనల్ క్యాంపస్ విషయంలో మాత్రం మీనమేషాలు లెక్కిస్తోందని దుయ్యబట్టారు. సల్కం చెరువు ఫుల్ ట్యాంక్ లెవల్ (FTL), బఫర్ జోన్‌ను ఆక్రమించి ఈ క్యాంపస్ నిర్మించారనే ఆరోపణలపై తెలంగాణ హైకోర్టు పలుమార్లు జోక్యం చేసుకుని, ప్రభుత్వ జాప్యంపై చీవాట్లు పెట్టినా సర్కారు తీరు మారలేదన్నారు. హైడ్రా, విద్యాశాఖ సహా పలు శాఖల నుంచి కోర్టు వివరాలు కోరినా, సామాన్యులపై చూపించే తొందరపాటును ఫాతిమా కాలేజీ వ్యవహారంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు చూపించడం లేదని ప్రశ్నించారు.

కాంగ్రెస్-మజ్లిస్ ముసుగు వీడింది

కాంగ్రెస్ పార్టీ మజ్లిస్‌ను యావత్ ముస్లిం సమాజానికి ఏకైక ప్రతినిధిగా భావిస్తూ ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తోందని కిషన్ రెడ్డి విమర్శించారు. హైడ్రా చర్యల వల్ల ఎంతోమంది పేద ముస్లింల ఇళ్లు కూలిపోయి, వారి జీవనోపాధి దెబ్బతిన్నప్పుడు మజ్లిస్ గానీ, కాంగ్రెస్ గానీ ఒక్క మాట కూడా మాట్లాడలేదని గుర్తుచేశారు. కానీ, ఒవైసీ సోదరుల సొంత ఆస్తుల విషయానికి వచ్చేసరికి మాత్రం ఈ రెండు పార్టీలు ఒకే తాటిపైకి వస్తున్నాయన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ముస్లిం సమాజంపై ఎలాంటి ప్రేమ లేదని, కేవలం తమ మిత్రుడైన ఒవైసీకి ఇబ్బంది కలగకూడదనే రేవంత్ సర్కారు తాత్సారం చేస్తోందని స్పష్టంగా అర్థమవుతోందన్నారు. ఫాతిమా విద్యాసంస్థల ఉదంతం కాంగ్రెస్ ద్వంద్వ వైఖరిని బట్టబయలు చేసిందని, తాము ముస్లింల ప్రతినిధులమని చెప్పుకునే హక్కు ఈ ఇరు పార్టీలకు లేదని తేల్చిచెప్పారు.

పేదలపై బుల్డోజర్లు.. పెద్దలకు రక్షణలా?

పేదల ఇళ్లపై బుల్డోజర్లతో విధ్వంసం సృష్టించి, కాంగ్రెస్-మజ్లిస్ రాజకీయ బంధం కోసం పెద్దల ఆస్తులకు నిరంతర రక్షణ కల్పించడమే ఈ ప్రభుత్వ ప్రాధాన్యతగా మారిందని కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల భూములు, చెరువులు, ప్రభుత్వ ఆస్తులు అనేవి తెలంగాణ ప్రజల సొత్తే తప్ప, రాజకీయ అండదండలు ఉన్నవారి వ్యక్తిగత ఆస్తులు కావని స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇకనైనా మతపరమైన, ఓటు బ్యాంకు రాజకీయాలను మానుకోవాలని.. ప్రజలందరికీ 'ఒకే చట్టం, ఒకే న్యాయం' అనే సూత్రాన్ని వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. ఒక్కొక్కరికీ ఒక్కో న్యాయం అమలుచేస్తున్న ప్రభుత్వ తీరుపై ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లుతోందని, వీటన్నింటినీ గమనిస్తున్న తెలంగాణ ప్రజలు త్వరలోనే ప్రభుత్వానికి దిమ్మతిరిగే సమాధానం చెబుతారని కిషన్ రెడ్డి హెచ్చరించారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ntvtelugu