Dailyhunt
Kyle Jamieson IPL Penalty: బిగ్ వార్నింగ్.. వైభవ్ సూర్యవంశీని అవుట్ చేసిన బౌలర్‌కు షాక్ ఇచ్చిన బీసీసీఐ..

Kyle Jamieson IPL Penalty: బిగ్ వార్నింగ్.. వైభవ్ సూర్యవంశీని అవుట్ చేసిన బౌలర్‌కు షాక్ ఇచ్చిన బీసీసీఐ..

NTV Telugu 2 weeks ago

Kyle Jamieson IPL Penalty: నిన్న రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ పేసర్ కైల్ జేమీసన్ ప్రవర్తించిన తీరు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

15 ఏళ్ల వయసున్న కుర్రాడు వైభవ్ సూర్యవంశీపై జేమీసన్ తన దూకుడును ప్రదర్శించి విమర్శల పాలయ్యాడు. జైపూర్‌లోని సవాయ్ మాన్ సింగ్ స్టేడియంలో జరిగిన ఈ పోరులో మొదటి ఇన్నింగ్స్ రెండో ఓవర్‌లోనే ఈ ఘటన చోటుచేసుకుంది. వైభవ్ సూర్యవంశీని అవుట్ చేసిన ఆనందంలో జేమీసన్ సంయమనం కోల్పోయాడు. సదరు బ్యాటర్ దగ్గరకు వెళ్లి చాలా అగ్రెసివ్‌గా ప్రవర్తించాడు. ఒక టీనేజ్ ప్లేయర్‌ను అంతలా కవ్వించడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారడమే కాకుండా, భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) దృష్టికి కూడా వెళ్లింది.

దీనిపై సీరియస్ ఐపీఎల్ యాజమాన్యం, జేమీసన్ ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.5ను ఉల్లంఘించినట్లు తేల్చింది. ప్రత్యర్థి ఆటగాడిని రెచ్చగొట్టేలా లేదా వారి నుంచి దూకుడు ప్రతిచర్య వచ్చేలా ప్రవర్తించడం ఈ నిబంధన కింద నేరంగా పరిగణించబడుతుంది. మ్యాచ్ రెఫరీ రాజీవ్ సేథ్ విధించిన శిక్షను జేమీసన్ అంగీకరించడంతో అతనికి ఒక డీమెరిట్ పాయింట్‌తో పాటు బిగ్ వార్నింగ్ సైతం ఇచ్చింది. లెవల్ 1 నిబంధనల ఉల్లంఘన కింద ఈ చర్యలు తీసుకున్నట్లు ఐపీఎల్ ఓ అధికారిక ప్రకటనలో స్పష్టం చేసింది. ఈ గొడవలు పక్కన పెడితే ఢిల్లీ క్యాపిటల్స్ అద్భుత ప్రదర్శన చేసి ఏడు వికెట్ల తేడాతో రాజస్థాన్ రాయల్స్‌ను మట్టికరిపించింది. ఈ విజయంతో ఈ సీజన్‌లో ఢిల్లీ తన నాలుగో విజయాన్ని నమోదు చేసుకుని జోరు కొనసాగిస్తోంది.

వరుసగా మూడు ఓటముల తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్ ఎట్టకేలకు విజయపథంలోకి అడుగు పెట్టింది. శుక్రవారం జైపూర్‌లో జరిగిన రసవత్తర పోరులో రాజస్థాన్ రాయల్స్‌పై ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. రాజస్థాన్ నిర్దేశించిన 226 పరుగుల భారీ లక్ష్యాన్ని ఢిల్లీ బ్యాటర్లు ఎంతో చాకచక్యంగా ఛేదించారు. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీకి ఓపెనర్లు కేఎల్ రాహుల్, పాతుమ్ నిస్సాంక అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చారు. వీరిద్దరూ కలిసి మొదటి వికెట్‌కు కేవలం 110 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి గెలుపు పునాది వేశారు. రాహుల్ 40 బంతుల్లోనే 75 పరుగులు చేయగా, నిస్సాంక 33 బంతుల్లో 62 పరుగులతో విరుచుకుపడ్డారు. చివరిలో ట్రిస్టన్ స్టబ్స్ (18 నాటౌట్), అశుతోష్ శర్మ (25 నాటౌట్) బాధ్యతాయుతంగా ఆడి మరో ఐదు బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని పూర్తి చేశారు.

అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 225 పరుగులు చేసింది. ఓపెనర్లు యశస్వి జైస్వాల్ (6), వైభవ్ సూర్యవంశీ (4) తొలి రెండు ఓవర్లలోనే అవుట్ కావడంతో రాజస్థాన్ కష్టాల్లో పడింది. అయితే, ఈ సీజన్‌లో ఫామ్ లేమితో ఇబ్బంది పడుతున్న కెప్టెన్ రియాన్ పరాగ్ (90 పరుగులు, 50 బంతుల్లో) అద్భుతమైన ఇన్నింగ్స్‌తో జట్టును ఆదుకున్నాడు. గత మ్యాచ్‌లో ‘వేపింగ్’ చేస్తూ దొరికిపోయి జరిమానా ఎదుర్కొన్న పరాగ్, ఈ మ్యాచ్‌లో ధ్రువ్ జురెల్ (42)తో కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. చివరి ఓవర్లలో డొనొవాన్ ఫెరీరా కేవలం 14 బంతుల్లో 47 పరుగులతో విధ్వంసం సృష్టించడంతో రాజస్థాన్ స్కోరు 200 దాటింది. ఢిల్లీ బౌలర్లలో మిచెల్ స్టార్క్ 3 వికెట్లు తీసి ఆకట్టుకున్నాడు, అందులో కీలకమైన పరాగ్ వికెట్ ఉంది. భారీ స్కోరు చేసినప్పటికీ, ఢిల్లీ బ్యాటర్ల ధాటికి రాజస్థాన్ బౌలర్లు నిలవలేకపోయారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ntvtelugu