వైవిధ్యమైన నటుడిగా, సేవా కార్యక్రమాల్లో ముందుండే వ్యక్తిగా హీరో మంచు మనోజ్కు టాలీవుడ్లో ప్రత్యేక గుర్తింపు ఉంది. తాజాగా తన పుట్టినరోజు సందర్భంగా నిర్వహించిన ప్రెస్ మీట్లో మనోజ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల రాజకీయ, సినీ వర్గాల్లో తీవ్ర సంచలనంగా మారాయి.
తన భార్య భూమా మౌనికా రెడ్డి రాజకీయ రంగప్రవేశంపై మనోజ్ హాట్ కామెంట్స్ చేశారు. తెలుగు రాష్ట్రాల్లో విస్తృతంగా సేవా కార్యక్రమాలు నిర్వహించేందుకు మనోజ్-మౌనిక దంపతులు ఇటీవల ‘ఐక్య ధైర్య సేవ సమితి ట్రస్ట్’ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ ట్రస్ట్ ద్వారా ప్రజలకు మరింత దగ్గరవుతున్న తరుణంలో, మౌనికా రెడ్డి రాజకీయాల్లోకి రాబోతున్నారనే వార్తలపై మనోజ్ స్పందించారు.
భూమా నాగిరెడ్డి, శోభా నాగిరెడ్డిల వారసురాలిగా మౌనికకు రాజకీయాలు కొత్తేమీ కాదని.. భవిష్యత్తులో ఆమె ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టబోతున్నారని మనోజ్ స్పష్టం చేశారు. ప్రజాసేవ చేయాలనే లక్ష్యంతోనే ఈ అడుగు పడబోతోందని ఆయన హింట్ ఇచ్చారు. ‘మంచు వారి కోడలు’ పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతుండటంతో రాయలసీమ రాజకీయాల్లో సరికొత్త సమీకరణాలు మొదలయ్యే అవకాశం ఉంది.
నిజానికి ఉమ్మడి కర్నూలు జిల్లాలో భూమా కుటుంబం ఒకప్పుడు ఓ వెలుగు వెలిగింది. టీడీపీ, ప్రజారాజ్యం, వైసీపీలలో భూమా నాగిరెడ్డి 2 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా గెలిచారు. ఆయన భార్య శోభా నాగిరెడ్డి కూడా రెండు సార్లు ఆళ్లగడ్డ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. శోభా నాగిరెడ్డి హఠాన్మరణంతో వారి కుమార్తె భూమా అఖిలప్రియ రాజకీయాల్లోకి వచ్చారు.వైసీపీ నుంచి గెలిచిన అఖిలప్రియ ఆ తర్వాత టీడీపీలో చేరి మంత్రి అయ్యారు. ప్రస్తుతం టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్నారు. భూమా నాగిరెడ్డి గుండెపోటుతో మృతి చెందడంతో ఆ కుటుంబం పెద్ద దిక్కును కోల్పోయింది. ఆ కుటుంబ వారసురాలిగా అఖిలప్రియ ప్రస్తుతం కొనసాగుతున్నారు. అయితే తల్లిదండ్రులు మృతి చెందిన తర్వాత పిల్లల మధ్య గ్యాప్ వచ్చినట్టు ఓ ప్రచారం. అఖిలప్రియ, మౌనికతో పాటు తమ్ముడు భూమా జగద్విఖ్యాత్ రెడ్డి రాజకీయ వారసత్వం కోసం రేసులో ఉన్నారు. అఖిలప్రియ, జగద్విఖ్యాత్ ఒక వర్గమనే ప్రచారం ఉంది. అందులో భాగంగానే ఇప్పుడు మౌనిక రాజకీయ ప్రవేశానికి రంగం సిద్ధం చేసుకున్నట్టు సమాచారం. అయితే ఆవిడ ఎక్కడి నుంచి పోటీ చేస్తారు.. ఏ పార్టీ తరపున నిలబడతారనేది కాలమే నిర్ణయించాలి.

