Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Maoists Surrender : జార్ఖండ్‌లో మావోయిస్టులకు భారీ దెబ్బ.. ఒకేసారి 27 మంది లొంగుబాటు..!

Maoists Surrender : జార్ఖండ్‌లో మావోయిస్టులకు భారీ దెబ్బ.. ఒకేసారి 27 మంది లొంగుబాటు..!

NTV Telugu 3 days ago

Maoists Surrender : జార్ఖండ్ రాష్ట్రంలో నక్సలైట్ల నెట్‌వర్క్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. రాష్ట్రంలో మావోయిస్టుల అణిచివేతే లక్ష్యంగా సాగుతున్న ప్రత్యేక డ్రైవ్‌లో భాగంగా గురువారం (మే 21, 2026) ఒకేసారి 27 మంది మావోయిస్టులు రాంచీలో పోలీసుల ఎదుట లొంగిపోయారు.

హింసా మార్గాన్ని వీడి జనజీవన స్రవంతిలో కలవాలనే ఉద్దేశంతో ప్రభుత్వానికి, పోలీసులకు వీరంతా తమ ఆయుధాలను అప్పగించారు.

రాష్ట్ర ప్రభుత్వం, రక్షక దళాలు సంయుక్తంగా చేపట్టిన 'ఆపరేషన్ నవజీవన్' ఈ చారిత్రాత్మక లొంగుబాటుకు ప్రధాన కారణమైంది. లొంగిపోయిన వారిలో 25 మంది నిషేధిత సీపీఐ (మావోయిస్ట్) సంస్థకు చెందిన వారు కాగా, మరో ఇద్దరు జేజేఎంపీ (JJMP) గ్రూప్‌నకు చెందిన సభ్యులు. ఈ ఆపరేషన్ ద్వారా మావోయిస్టు సానుభూతిపరులలో, క్షేత్రస్థాయి క్యాడర్‌లో మార్పు తీసుకురావడంలో పోలీసులు పూర్తి విజయం సాధించారు.

లొంగిపోయిన వారిలో మోస్ట్ వాంటెడ్ జాబితాలో ఉన్న హైలెవెల్ లీడర్లు ఉండటం గమనార్హం. మొత్తం 27 మందిలో ఏడుగురు సబ్-జోనల్ కమాండర్లు, ఆరుగురు ఏరియా కమాండర్లు ఉన్నారు. ముఖ్యంగా దాదాపు 123 హింసాత్మక కేసుల్లో మోస్ట్ వాంటెడ్ నిందితుడిగా ఉండి, సుదీర్ఘకాలంగా పోలీసులకు దొరకకుండా తిరుగుతున్న మావోయిస్ట్ అగ్రనేత సాగెన్ అంగారియా కూడా లొంగిపోయిన వారిలో ఉన్నారు.

పోలీసుల ఎదుట మోకాళ్లూనిన మావోయిస్టులు తమ వద్ద ఉన్న అత్యాధునిక ఆయుధ సంపత్తిని, మందుగుండు సామగ్రిని భద్రతా దళాలకు అప్పగించారు. ఇందులో భారీ నష్టాన్ని కలిగించే లైట్ మెషిన్ గన్స్ (LMGs), ఇన్సాస్ (INSAS) రైఫిళ్లు, ఎస్ఎల్ఆర్ గన్లతో పాటు దాదాపు 3,000 కు పైగా లైవ్ తూటాలు (Ammunition) ఉన్నాయి. వీటన్నింటినీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ఈ భారీ లొంగుబాటుతో జార్ఖండ్‌లోని అత్యంత సమస్యాత్మక ప్రాంతాలైన సరాండా , కోల్హాన్ అడవుల్లో మావోయిస్టుల బలం పూర్తిగా క్షీణించిందని పోలీస్ ఉన్నతాధికారులు వెల్లడించారు. ఒకప్పుడు ఈ ప్రాంతాలను శాసించిన మావోయిస్ట్ దళాలలో ఇప్పుడు కేవలం 16 నుండి 17 మంది సభ్యులు మాత్రమే మిగిలి ఉన్నట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు భావిస్తున్నాయి. త్వరలోనే ఆ ప్రాంతాన్ని పూర్తి నక్సల్ రహిత జోన్‌గా మారుస్తామని ధీమా వ్యక్తం చేశారు.

చట్టాన్ని గౌరవించి లొంగిపోయిన ఈ 27 మంది అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం పూర్తి పునరావాస (Rehabilitation) సౌకర్యాలు కల్పిస్తామని జార్ఖండ్ ప్రభుత్వం ప్రకటించింది. లొంగుబాటు విధానం ప్రకారం వారికి రావాల్సిన ఆర్థిక సాయం, ఉపాధి అవకాశాలు , వారి పిల్లల చదువుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను ప్రభుత్వం పర్యవేక్షిస్తుందని, మిగిలిన వారు కూడా ఆయుధాలు వీడి సమాజంలో కలవాలని అధికారులు పిలుపునిచ్చారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ntvtelugu