ప్రధాని నరేంద్రమోడీ ఈరోజు ఉదయం లడఖ్ లోని సరిహద్దుల్లో ఆకస్మిక పర్యటనకు వెళ్లారు. ప్రధాని షెడ్యూల్ లో లేని ఈ పర్యటనకు ముందుగానే రహస్య ఏర్పాట్లు జరిగినట్టు తెలుస్తోంది. ఈ పర్యటనలో ప్రధానితో పాటు త్రివిధ దళాధిపతి బిపిన్ రావత్ కూడా ఉన్నారు. దేశం కోసం పోరాడుతున్న సైనికుల్లో మనోస్థైర్యాన్ని నింపడానికి ప్రధాని లడఖ్ సరిహద్దులో పర్యటించారు. మోడీ పర్యటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. భారత్, చైనా మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో మోడీ అకస్మాత్తుగా సరిహద్దుల్లో పర్యటించటం చర్చనీయాంశంగా మారింది.
అయితే భారత ప్రధాని మోడీ లఢఖ్ పర్యటన గురించిన సమాచారం మాకు ముందే తెలుసని చైనా విదేశాంగ శాఖ ఒక ప్రకటన చేసింది.
భారతదేశం మరియు చైనా దౌత్య మార్గాల ద్వారా సరిహద్దులలో ఉద్రిక్తతలను తగ్గించడంపై పరస్పర సమాచారం మార్పిడి మరియు చర్చలు కొనసాగుతున్నాయని ఆ ప్రకటనలో పేర్కొంది. ఈ సమయంలో పరిస్థితిని మరింత తీవ్రతరం చేసే ఏ చర్యలలోనూ ఏ దేశం పాల్గొనకూడదని పరోక్షంగా మోడీ పర్యటన మీద చురకలు వేసింది. ఈ మేరకు మోడీ లడఖ్ పర్యటనపై చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి జావో లిజియన్ ప్రకటన చేశారు.

