Dailyhunt
Off The Record: అక్కడ జనసేన నేతలు లోలోపల మదనపడుతున్నారా..?

Off The Record: అక్కడ జనసేన నేతలు లోలోపల మదనపడుతున్నారా..?

NTV Telugu 1 week ago

Off The Record: ఎన్టీఆర్ జిల్లా జనసేన నేతలు లోలోపల మధనపడుతున్నారట. పార్టీ ఆవిర్భావం తర్వాత ఇప్పటి వరకు ఈ జిల్లాలో ఒక్క సీట్లో కూడా గెలవలేదు. 2019 ఎన్నికల్లో వామపక్షాలతో కలిసి పోటీ చేసిన జనసేన జిల్లాలో బోణీ కొట్టలేకపోయింది.

ఇక 2024 ఎన్నికల్లో కూటమి పొత్తులో భాగంగా విజయవాడ పశ్చిమం పోటీ చేస్తారని జోరుగా ప్రచారం జరిగింది. కానీ… అనూహ్యంగా ఆ సీటు బీజేపీ కోటాలోకి వెళ్లిపోయింది. దాంతో అసలు ఒక్క సీట్లో కూడా పోటీ చేసే అవకాశం దక్కలేదు పార్టీకి. కూటమిగా ఏర్పడినందున కొన్ని త్యాగాలు తప్పవని అప్పట్లో పార్టీ అధ్యక్షుడు పవన్‌ చెప్పిన మాటలకు తలూపేశారు ఎన్టీఆర్‌ జిల్లా నాయకులు. అయితే… పక్కనే ఉన్న కృష్ణా జిల్లాలో మాత్రం అవనిగడ్డ అసెంబ్లీ, మచిలీపట్నం పార్లమెంట్ సీటును దక్కించుకుని రెండు చోట్ల గెలిచింది జనసేన. దీంతో జిల్లాలో ఇద్దరు ప్రజా ప్రతినిధులు పార్టీ క్యాడర్‌కు అండగా నిలుస్తున్నారు. సరిగ్గా ఇదే పాయింట్‌ని హైలైట్‌ చేస్తున్నారు ఎన్టీఆర్ జిల్లా జనసేన నాయకులు. కృష్ణా జిల్లా లీడర్స్‌,కేడర్‌ తమ పార్టీ నుండి గెలిచిన ప్రజాప్రతినిధులను కలిసి సమస్యలు చెప్పుకోవడానికి, పరిష్కరించుకోవడానికి వీలుందిగానీ… మాకు దిక్కెవరని అడుగుతున్నారట. ఇంకా చెప్పాలంటే ఎన్టీఆర్ జిల్లాలో తీవ్ర ఇబ్బందికరమైన పరిస్థితుల్ని ఎదుర్కొంటున్నామని అంటున్నారు.

ఇక్కడ పార్టీ తరపున ఒక్క ప్రజాప్రతినిధి కూడా లేకపోవడం, చివరికి చెప్పుకోతగ్గ నామినేటెడ్‌ పదవి కూడా ఇవ్వకపోవడంతో మాకు పెద్ద దిక్కు కరనైందన్నది వాళ్ళ ఆవేదన. సామినేని ఉదయభాను జనసేన జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్నా…కూటమి ఎమ్మెల్యేల నుంచి ఆయనకు పెద్దగా సహకారం అందటం లేదని చెప్పుకుంటున్నారు. ఇదే సమయంలో పార్టీ నేతల్లో కొత్త సందేహాలు చర్చనీయాంశం అవుతున్నాయి. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా స్థానిక సంస్థల పదవీకాలం ముగిసింది. త్వరలోనే ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది. కానీ…. ఎన్టీఆర్‌ జిల్లా పరిధిలో ఎక్కడా ఇంతవరకు పార్టీ ఇన్ఛార్జ్‌లను నియమించలేదు. కేవలం పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ కింద కొందరి పేర్లు చెప్పి… నియోజకవర్గంలో సమన్వయం చేసుకునే బాధ్యతల్ని వారికి అప్పగించారు. దీంతో… అసలు వచ్చే ఎన్నికల్లోనైనా ఈ జిల్లా నుంచి పార్టీ పోటీ చేస్తుందా లేదా అన్న అనుమానాలు నాయకుల్లో పెరుగుతున్నాయట. పార్టీ అధ్యక్షుడు పవన్‌ కూడా ఆ విషయంలో క్లారిటీ ఇవ్వడంలేదని, ఏదో ఒకటి చెప్పేస్తే… మేమేం చేయాలో కూడా నిర్ణయించుకుంటాం కదా అని అంటున్నారు కొందరు లీడర్స్‌.

ఈ పరిస్థితుల్లో… రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పూర్తి బాధ్యతలు తీసుకోవడానికి ఎవరూ ముందుకు రావడం లేదట. ఒక వేళ ఇప్పుడు ముందుకొచ్చి భుజాన వేసుకున్నా రేపటి పరిస్థితులు ఎలా ఉంటాయోనన్న ఆందోళనే అందరికీ. ఆ విషయంలో పవన్‌ నుంచి భరోసా కోరుకుంటున్నారు వాళ్ళు. ఎన్నికల సమయంలో విజయవాడ పశ్చిమ నుంచి పోటీ చేయాలని భావించి చివరి క్షణంలో తప్పుకున్న జనసేన… ఈసారి ఏదో ఒక స్థానం నుంచి అయినా బరిలోకి దిగితే క్యాడర్‌కు కొంత జోష్ వస్తుందన్నది స్థానిక నాయకుల మాట. రాష్ట్ర రాజకీయ రాజధాని అని చెప్పుకునే బెజవాడ సిటీలో పార్టీకి కనీస ప్రాతినిధ్యం లేకపోవడంతో పుంజుకోలేకపోతోందని ఆందోళన పడుతున్నారు కార్యకర్తలు. వచ్చే ఎన్నికల్లో జిల్లా పరిధిలో ఎక్కడో ఒకచోట నుంచి పోటీ చేస్తామని కనీసం ప్రకటన అయినా చేస్తే… మాకు కాస్త భరోసా ఉంటుందన్నది వాళ్ల వాయిస్‌. చురుగ్గా పనిచేసే నాయకులు, కార్యకర్తలు రేపు స్థానిక ఎన్నికల్లో యాక్టివ్‌గా ఉండటానికి అది బూస్ట్‌లా పని చేస్తుందని అంటున్నారు. ఇదే విషయాన్ని కాందరు నాయకులు పవన్‌ దృష్టికి తీసుకువెళ్ళే ప్లాన్‌లో ఉన్నారట. దీంతో ఆయన ఎలాంటి క్లారిటీ ఇస్తారన్నది ఆసక్తికరంగా మారింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ntvtelugu