కాకలు తీరిన రాజకీయ నాయకులంతా అక్కడ కామ్గా ఉండాల్సిన దుస్థితి ఏర్పడిందా? దశాబ్దాలుగా పార్టీ కోసం కష్టపడితే… కనీసం పార్టీ పదవి కూడా ఇవ్వలేదంటూ వాళ్ళు తీవ్ర అసహనంతో ఉన్నారా?
2024లో టిక్కెట్లు దక్కలేదు సరికదా… చివరికి పార్టీ పదవులు కూడా ఇవ్వకుంటే ఇక మా సీనియారిటీకి అర్ధం ఏంటని అడుగుతున్న ఆ టీడీపీ సీనియర్స్ ఎవరు? ఏ జిల్లాలో ఉందా పరిస్థితి? ఉమ్మడి కర్నూలు జిల్లాలో టీడీపీ సీనియర్స్ చాలామంది మింగలేక కక్కలేక అన్నట్టు ఉన్నారట. పదవుల విషయంలో వాళ్లు తీవ్ర అసంతృప్తిగా ఉన్నట్టు తెలుస్తోంది. కొందరేమో… దాన్ని అప్పుడప్పుడు ఏదో ఒక రూపంలో బహిరంగంగా వ్యక్తం చేస్తుంటే… మరి కొందరు మాత్రం పరువు సమస్య అంటూ… లోలోపల సన్నిహితుల దగ్గర గోడు వెళ్ళబోసుకుంటున్నట్టు తెలుస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఉమ్మడి జిల్లాలో 14 అసెంబ్లీ సీట్లకు గాను… 11 టీడీపీ, ఒకటి బీజేపీ గెల్తుకున్నాయి. రెండు ఎంపీ సీట్లు టీడీపీ ఖాతాలోనే పడ్డాయి.
ఈ ఘన విజయంలో కొద్దోగొప్పో తమ పాత్ర ఉందని, అయినాసరే…. గుర్తించకుండా అధికారంలోకి వచ్చాక ప్రభుత్వంగానీ, పార్టీలోగానీ ఏ మాత్రం విలువ ఇవ్వడం లేదంటూ తెగ బాధపడిపోతున్నారట సీనియర్స్. ఇటీవల ప్రకటించి పార్టీ పదవుల్లో కొందరికి కీలక స్థానాలు ఇచ్చింది టీడీపీ అధిష్టానం. కానీ… తమను విస్మరించారంటూ సీనియర్స్ ఆవేదనగా ఉన్నట్టు తెలుస్తోంది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో పార్టీ ఆవిర్భావం నుంచి అంటిపెట్టుకొని ఉన్నవాళ్ళలో ఆదోని మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు ముందు వరుసలో వుంటారు. ఆదోని నుంచి మూడు సార్లు గెలిచారాయన. 2024 ఎన్నికల్లో టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నించినా కూటమి పొత్తులో భాగంగా ఆదోని సీటు బీజేపీ కోటాలోకి వెళ్ళిపోయింది. అందుకు బదులు మీనాక్షి నాయుడికి ఎమ్మెల్సీ పదవి ఇస్తామని హామీ ఇచ్చినా ఇప్పటి వరకు నెరవేరలేదు.

