Pakistan: ద్రవ్యోల్బణం, ఇరాన్ యుద్ధం పాకిస్తాన్ను ముప్పుతిప్పలు పెడుతున్నాయి. పాకిస్తాన్లో లీటర్ పెట్రోల్ PKR 458.4 (సుమారు ₹152)కు చేరగా, డీజిల్ ధర లీటరుకు PKR 520.35కు పెరిగింది.
ఏకంగా పెట్రోల్, డీజిల్ ధరలు 42.7 శాతం, 54.9 శాతం పెరిగాయి. అయితే, ఈ పెరుగుదలను పాకిస్తాన్ మాజీ స్టార్ క్రికెటర్ షాహిద్ అఫ్రిది సమర్థించారు. ''ప్రపంచం ప్రస్తుతం ఇంధన సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. అనేక దేశాలతో పోలిస్తే పాకిస్తాన్ ఇప్పటికే మెరుగైన స్థితిలో ఉంది. ఈ సమయంలో మనం ప్రభుత్వానికి మద్దతు ఇచ్చి, వారికి అండగా నిలబడాలి'' అని కోరారు. ఇదే కాకుండా ప్రజలు ఐక్యంగా ఉండాలని, సహనం వహించాలని, ప్రభుత్వాన్ని విశ్వసించాలని కోరారు.
అయితే, అఫ్రిది వీడియో సందేశంపై పాకిస్తాన్ ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాక్ నెటిజన్లు అతడిని ప్రభుత్వ ''పీఆర్ ప్రతినిధి'' అని ఎద్దేవా చేశారు. మరికొందరు అతను సాధారణ ప్రజల కష్టాలను పట్టించుకోవడం లేదని అన్నారు. ఇప్పుడు అఫ్రిది వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో విస్తృతంగా ట్రోలింగ్ నడుస్తోంది. ఇరాన్ యుద్ధం కారణంగా ప్రపంచ చమురు సరఫరా వ్యవస్థ దెబ్బతింది. ముఖ్యంగా పాక్ ప్రజలపై అక్కడి ప్రభుత్వం అదనపు భారాన్ని పెంచుతోంది.

