Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Pawan Kalyan: తెలంగాణ వాళ్లకు మా తెలంగాణ అనే భావన ఉంది.. ఆంధ్రా వాళ్లకు ఎటువంటి భావన ఉందో అర్థంకాదు..!

Pawan Kalyan: తెలంగాణ వాళ్లకు మా తెలంగాణ అనే భావన ఉంది.. ఆంధ్రా వాళ్లకు ఎటువంటి భావన ఉందో అర్థంకాదు..!

NTV Telugu 1 week ago

Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అంశంపై డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రజల మధ్య ఐక్యతను పెంపొందించడమే తమ లక్ష్యమని, ఎట్టి పరిస్థితుల్లోనూ విభజనలు సృష్టించే రాజకీయాలకు తాము మద్దతు ఇవ్వబోమని స్పష్టం చేశారు.

ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో రాష్ట్రం పట్ల ఒకే భావన పెరగాల్సిన అవసరం ఉందని పవన్ అన్నారు. తెలంగాణ ప్రజలకు తమ రాష్ట్రంపై ఉన్న భావోద్వేగ అనుబంధం కనిపిస్తోందని, అయితే ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం రాష్ట్రం కంటే కులాలపై ఎక్కువ అభిమానం కనిపించడం ఆందోళన కలిగిస్తోందన్నారు. రాష్ట్రం అనే భావన బలపడాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

అమరావతి రాజధాని నిర్మాణం కోసం 33 వేల ఎకరాలకు పైగా భూమిని రైతులు స్వచ్ఛందంగా ఇచ్చారని గుర్తు చేసిన పవన్, వారి త్యాగాన్ని ప్రతి ఒక్కరూ గౌరవించాలని అన్నారు. రైతుల సహకారం, నమ్మకంతో ప్రారంభమైన అమరావతి ప్రాజెక్టును రాజకీయ వివాదాల కేంద్రంగా మార్చడం సరికాదన్నారు. 'జై ఆంధ్రా' అనే నినాదం కేవలం ఒక ప్రాంతానికి సంబంధించినది కాదని, మొత్తం రాష్ట్రాన్ని ఒకే తాటిపైకి తీసుకువచ్చే భావనగా చూడాలని సూచించారు. రాష్ట్ర ప్రజలందరికీ అమరావతి తమ రాజధాని అనే భావన కలగాలని చెప్పారు. ప్రజలను కలపడానికి వచ్చామని, విడదీయడానికి రాలేదని స్పష్టం చేశారు.

అమరావతి విషయంలో అభిప్రాయ భేదాలు ఉంటే వాటిని విధానపరంగా చర్చించాలని పవన్ సూచించారు. రాజధాని నమూనా, అభివృద్ధి ప్రణాళికలు, మూడు రాజధానుల ప్రతిపాదన వంటి అంశాలపై రాజకీయ పార్టీలు తమ అభిప్రాయాలను చెప్పవచ్చని, కానీ బెదిరింపులు, హింసాత్మక వ్యాఖ్యలు చేయడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలపై విమర్శలు చేసిన పవన్, రౌడీయిజం, గూండాయిజం వంటి ధోరణులతో ఎవరినీ భయపెట్టలేరని అన్నారు. చంపేస్తాం, నరికేస్తాం వంటి వ్యాఖ్యలతో ప్రజలను భయపెట్టే రోజులు పోయాయని వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్యంలో ప్రతి అంశాన్ని చర్చల ద్వారానే పరిష్కరించాలన్నారు.

గత ప్రభుత్వ హయాంలో అమరావతిపై వివిధ ప్రతిపాదనలు వచ్చాయని, మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ప్రాంతాలను కలిపి రాజధానిగా అభివృద్ధి చేయాలనే ఆలోచనలు కూడా వినిపించాయని గుర్తుచేశారు. అయితే వాటి వెనుక ఉన్న ఉద్దేశాలపై అప్పట్లో అనేక సందేహాలు వ్యక్తమయ్యాయని పేర్కొన్నారు. 33 వేల ఎకరాల్లో రాజధాని నిర్మాణానికి గతంలోనే విస్తృత అంగీకారం లభించిందని, అందువల్ల ఇప్పుడు అందరూ కలిసి అమరావతి అభివృద్ధికి కృషి చేయాల్సిన అవసరం ఉందని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. రాజధాని అంశాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించకుండా, రాష్ట్ర భవిష్యత్తు కోసం ముందుకు తీసుకెళ్లాలని సూచించారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ntvtelugu