Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
PM Modi: రోమ్‌లో మోదీ.. భారత్-ఇటలీ వ్యూహాత్మక భాగస్వామ్యంపై దృష్టి.!

PM Modi: రోమ్‌లో మోదీ.. భారత్-ఇటలీ వ్యూహాత్మక భాగస్వామ్యంపై దృష్టి.!

NTV Telugu 4 days ago

PM Modi in Italy: భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) ఐదు దేశాల పర్యటనలో చివరి దశగా ఇటలీ రాజధాని రోమ్ కు చేరుకున్నారు. మే 19 (భారత కాలమానం ప్రకారం) ఆయన ఇటలీకి చేరుకోగా, ఈ పర్యటన మే 20 వరకు కొనసాగనుంది.

ఇటలీ ప్రధాని జార్జియా మెలోని (Giorgia Meloni) ఆహ్వానం మేరకు ఈ పర్యటన జరుగుతోంది. ఇటలీ పర్యటనకు ముందు ప్రధాని మోదీ నార్వేలో జరిగిన 3వ ఇండియా-నార్డిక్ సమ్మిట్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నార్వేతో పాటు ఇతర నార్డిక్ దేశాలతో భారత్ సంబంధాలను మరింత బలోపేతం చేసే దిశగా పలు సమావేశాలు, చర్చలు నిర్వహించారు.

ఇటలీ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ, ఇటలీ అధ్యక్షుడు సెర్గియో మట్టారెల్లా (Sergio Mattarella)ను కలవనున్నారు. అలాగే ప్రధాని జార్జియా మెలోనితో ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించనున్నారు. గతంలో 2024 జూన్‌లో జరిగిన జీ7 సమ్మిట్‌లో పాల్గొనేందుకు కూడా ప్రధాని మోదీ ఇటలీకి వెళ్లిన విషయం తెలిసిందే. భారత్-ఇటలీ సంబంధాలు ఈ మధ్య కాలంలో వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. ముఖ్యంగా "జాయింట్ స్ట్రాటజిక్ యాక్షన్ ప్లాన్ 2025-2029" కింద వాణిజ్యం, పెట్టుబడులు, రక్షణ, భద్రత, స్వచ్ఛ ఇంధనం, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఆవిష్కరణలు, ప్రజల మధ్య సంబంధాల వంటి కీలక రంగాల్లో రెండు దేశాలు కలిసి పనిచేస్తున్నాయి.

ఇరు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలు కూడా బాగా బలపడ్డాయి. 2025లో భారత్-ఇటలీ మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం 16.77 బిలియన్ డాలర్లకు చేరుకుంది. అలాగే 2000 ఏప్రిల్ నుంచి 2025 సెప్టెంబర్ వరకు భారత్‌లో ఇటలీ పెట్టుబడులు 3.66 బిలియన్ డాలర్లకు చేరినట్లు సమాచారం. ఈ పర్యటన ద్వారా భారత్-ఇటలీ మధ్య ఆర్థిక, వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత బలపడటంతో పాటు.. కొత్త పెట్టుబడులు, వ్యాపార అవకాశాలకు మార్గం సుగమం అవుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ntvtelugu