సరికొత్త ప్రయోగాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అయిన లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు డైరెక్ట్ చేసిన Sing Geetham థియేటర్లలో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది..
వైజయంతీ మూవీస్ బ్యానర్పై క్రియేటివ్ డైరెక్టర్ నాగశ్విన్ నేతృత్వంలో రూపొందిన ఈ సినిమాను వీక్షించిన జూనియర్ ఎన్టీఆర్, సోషల్ మీడియా వేదికగా చిత్ర యూనిట్పై ప్రశంసల వర్షం కురిపిస్తూ ఒక ఎమోషనల్ రివ్యూ ఇచ్చారు. సినిమా చూశాక ఎన్టీఆర్ తన హృదయం బరువెక్కిందని పేర్కొన్నారు. "'#Sing Geetham' నా మనసును లోతుగా తాకిన ఒక బ్యూటిఫుల్ ఫిల్మ్. 94 ఏళ్ల వయసులో కూడా లెజెండరీ సింగీతం శ్రీనివాసరావు తనలోని సృజనాత్మకతను, అనుభవాన్ని ఈ సినిమా ద్వారా పంచుకున్న విధానం నాలాంటి ఎంతోమందికి ఎంతో స్పూర్తిని ఇస్తుంది" అని తారక్ కొనియాడారు.
ఈ సినిమాకు సంగీతం అందించిన రాక్స్టార్ దేవిశ్రీ ప్రసాద్ పనితీరును ఎన్టీఆర్ ప్రత్యేకంగా అభినందించారు. "దేవిశ్రీ.. నువ్వు ప్రతి సీన్ను నీ మ్యూజిక్తో నెక్స్ట్ లెవెల్కు తీసుకెళ్లావు. సినిమాలో ప్రతి సన్నివేశంలోనూ ఒక అద్భుతమైన మ్యాజిక్ను క్రియేట్ చేశావు" అంటూ ప్రశంసించారు. అలాగే దర్శకుడు నాగశ్విన్ను ఉద్దేశిస్తూ.. "ఒక దిగ్గజ దర్శకుడి 40 ఏళ్ల నాటి కలని ఈరోజు వెండితెరపై నిజం చేయడం అనేది నాగశ్విన్ నీకు దేవుడు ఇచ్చిన వరంగా భావిస్తున్నాను. సింగీతం గారికి నువ్వు, వైజయంతీ ఫిలింస్ సంస్థ ఇచ్చిన ఈ ట్రిబ్యూట్ ఎప్పటికీ గుర్తుండిపోతుంది. చిత్ర యూనిట్ మొత్తానికి నా అభినందనలు" అని ఎన్టీఆర్ ట్వీట్ చేశారు.
సింగీతం శ్రీనివాసరావు గారి సినిమాలు ఎప్పుడూ ప్రేక్షకులను సరికొత్త సర్ప్రైజ్లతో ఆకట్టుకుంటాయి. అదే శైలిని ఫాలో అవుతూ.. సినిమా విడుదలైన తర్వాత ఈ చిత్ర అధికారిక ట్రైలర్ను రిలీజ్ చేయడం టాలీవుడ్లో ఒక పెద్ద వినూత్న ప్రయోగంగా నిలిచింది. ఈ మోస్ట్ అవైటెడ్ ట్రైలర్ను స్వయంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం తనకే దక్కిన గౌరవంగా భావిస్తున్నట్లు ఎన్టీఆర్ తెలిపారు. ఈ హార్ట్ టచింగ్ మూవీని ప్రతి ఒక్కరూ థియేటర్లలోనే చూసి ఆస్వాదించాలని తారక్ అభిమానులకు పిలుపునిచ్చారు.

