Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Twisha Sharma: ట్విషా శర్మ మరణానికి ముందు ఎక్కడకెళ్లిందంటే.. వెలుగులోకి వీడియో

Twisha Sharma: ట్విషా శర్మ మరణానికి ముందు ఎక్కడకెళ్లిందంటే.. వెలుగులోకి వీడియో

NTV Telugu 2 days ago

తెలుగు నటి ట్విషా శర్మ మృతి కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆమె మృతి చెందడానికి కొన్ని గంటల ముందు భోపాల్‌లోని ఓ బ్యూటీ పార్లర్‌కు వెళ్లినట్లు సీసీటీవీ ఫుటేజ్ వెలుగులోకి వచ్చింది.

ఈ ఫుటేజ్ ఇప్పుడు దర్యాప్తులో కీలక ఆధారంగా మారనుంది. రంగంలోకి దిగిన సిట్ బృందం ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఈ క్రమంలో బ్యూటీ పార్లర్‌కు చెందిన వీడియో వెలుగులోకి వచ్చింది.

భోపాల్‌కు చెందిన న్యాయవాది సమర్థ్ సింగ్‌ను వివాహం చేసుకున్న ట్విషా శర్మ.. మే 12న 'ఎక్స్‌ప్రెషన్ బ్యూటీ పార్లర్'కు వెళ్లినట్లు తెలుస్తోంది. అక్కడ సుమారు మూడు గంటల పాటు గడిపింది. సీసీటీవీ దృశ్యాలను బట్టి చూస్తుంటే.. ఆమె చాలా ప్రశాంతంగా కనిపించడమే కాకుండా హెడ్ మసాజ్ కూడా చేయించుకున్నట్లు కనిపిస్తోంది. కాళ్లు డెస్క్‌పై పెట్టి మసాజ్ చేయించుకుంది. ఆ తర్వాత కొన్ని గంటలకే భోపాల్‌లోని కటారా హిల్స్ ప్రాంతంలోని అత్తగారింట్లో జిమ్నాస్టిక్ తాడుతో ఉరివేసుకున్న స్థితిలో కనిపించింది.

ఇప్పటికే పోస్టుమార్టం నివేదికలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు పేర్కొన్నప్పటికీ.. ట్విషా కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆమె శరీరంపై గాయాల మచ్చలు ఉన్నాయని.. ఇది సాధారణ ఆత్మహత్యలా కనిపించడం లేదని ఆరోపిస్తున్నారు. పెళ్లైన తర్వాత వరకట్న వేధింపులు, మానసిక హింసకు గురిచేశారని ట్విషా తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.

ఇక తాజాగా బయటపడిన బ్యూటీ పార్లర్ సీసీటీవీ ఫుటేజ్ మరిన్ని ప్రశ్నలు లేవనెత్తుతోంది. వీడియోలో ట్విషా ఒత్తిడిలో ఉన్నట్లు కనిపించకపోవడం గమనార్హం. ఆమె బ్యూటీ పార్లర్‌లో ఉన్న సిబ్బందితో నవ్వుతూ మాట్లాడినట్లు కనిపించింది. డ్రగ్స్ సేవించినట్లుగానీ.. తేడాగా కనిపించడం గానీ ఎక్కడా కనిపించలేదు. ఇదే సమయంలో పార్లర్ యజమాని కిరణ్ పరిహార్ సంచలన విషయాలు వెల్లడించారు. ఘటన జరిగిన మరుసటి రోజు ట్విషా అత్తగారు, రిటైర్డ్ జడ్జి గిరిబాలా సింగ్ తనను సంప్రదించారని తెలిపారు. ట్విషా ఏ సేవలు తీసుకుందో.. సీసీటీవీ రికార్డులు ఉన్నాయో లేదో అడిగారని చెప్పారు. అనంతరం 3-4 మంది న్యాయవాదులను పంపించి ఫుటేజ్ పరిశీలించినట్లు కూడా ఆరోపించారు.

ఇక ట్విషా అత్తగారింటి సీసీటీవీ ఫుటేజ్ కూడా కీలకంగా మారింది. అందులో ట్విషా సాయంత్రం 7.20 గంటల సమయంలో మెట్లపై నుంచి టెర్రస్ వైపు వెళ్లినట్లు కనిపిస్తోంది. అయితే దాదాపు గంట తర్వాత ఆమె మృతదేహాన్ని భర్త సమర్థ్ సింగ్, మరో ఇద్దరు కిందకు తీసుకొచ్చినట్లు ఫుటేజ్‌లో ఉంది. ఆ మధ్యలో జరిగిన 60 నిమిషాల్లో అసలు ఏమి జరిగిందన్నదే ఇప్పుడు ప్రధాన ప్రశ్నగా మారింది.

కిందకు తీసుకొచ్చిన తర్వాత మెట్ల దగ్గర ట్విషాకు సీపీఆర్ చేసినట్లు కనిపిస్తున్నప్పటికీ.. వెంటనే ఆస్పత్రికి ఎందుకు తరలించలేదన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం ట్విషా మృతదేహం భోపాల్ ఎయిమ్స్ మార్చురీలో భద్రపరిచారు. కుటుంబ సభ్యుల డిమాండ్ మేరకు మధ్యప్రదేశ్ హైకోర్టు రెండో పోస్టుమార్టానికి అనుమతి ఇచ్చింది. ఢిల్లీ ఎయిమ్స్ వైద్యుల బృందం ఈ పోస్టుమార్టం నిర్వహించనుంది. తొలి పోస్టుమార్టం నివేదికతో రెండో నివేదిక భిన్నంగా ఉంటుందా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇక ప్రధాన నిందితుడు, భర్త సమర్థ్‌ సింగ్ న్యాయస్థానం ఎదుట లొంగిపోయాడు. ఇతడి నుంచి మరిన్ని వివరాలను పోలీసులు రాబట్టనున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ntvtelugu