Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Venkatesh Iyer: రజత్ పాటిదార్ ఇక్కడ ఉండాల్సిన వాడు కాదు.. ఆర్సీబీ కెప్టెన్‌పై వెంకటేష్ అయ్యర్ కీలక వ్యాఖ్యలు..

Venkatesh Iyer: రజత్ పాటిదార్ ఇక్కడ ఉండాల్సిన వాడు కాదు.. ఆర్సీబీ కెప్టెన్‌పై వెంకటేష్ అయ్యర్ కీలక వ్యాఖ్యలు..

NTV Telugu 2 weeks ago

ఇండియన్ ప్రీమియర్ లీగ్ చరిత్రలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) సరికొత్త చరిత్ర సృష్టించింది. అహ్మదాబాద్ వేదికగా ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ జట్టుపై ఘనవిజయం సాధించడం ద్వారా ఆర్‌సీబీ వరుసగా రెండోసారి ఐపీఎల్ టైటిల్‌ను కైవసం చేసుకుంది.

గత ఏడాది తమ 18 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ తొలిసారిగా విజేతగా నిలిచిన బెంగళూరు, ఈ ఏడాది కూడా అదే ఫామ్‌ను కొనసాగించి లీగ్‌పై పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. శుభ్‌మన్ గిల్ నేతృత్వంలోని గుజరాత్ టైటాన్స్ జట్టును మొదట 20 ఓవర్లలో 155 పరుగులకే కట్టడి చేసిన ఆర్‌సీబీ, ఆ తర్వాత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అద్భుతమైన ఫామ్‌తో ఆకట్టుకుని ఆడిన అజేయ 75 పరుగుల ఇన్నింగ్స్ సాయంతో మరో రెండు ఓవర్లు మిగిలి ఉండగానే ఐదు వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది.

ఈ చారిత్రాత్మక విజయం అనంతరం ఆర్‌సీబీ బ్యాటర్ వెంకటేష్ అయ్యర్ తమ జట్టు కెప్టెన్ రజత్ పాటిదార్ నాయకత్వ ప్రతిభను ఎంతగానో ప్రశంసించారు. మధ్యప్రదేశ్ దేశీవాళీ జట్టులో కూడా పాటిదార్‌కు సహచరుడైన వెంకటేష్ అయ్యర్ మాట్లాడుతూ.. పాటిదార్ ఒక అద్భుతమైన నాయకుడని కొనియాడారు. రజత్ పాటిదార్ ప్రతిభపై తమ మధ్యప్రదేశ్ జట్టుకు ఎప్పటి నుంచో నమ్మకం ఉందని, ఆయన ఒకరోజు ఖచ్చితంగా పెద్ద స్థాయికి చేరుకుంటారని తాము ముందే ఊహించామని తెలిపారు. తాను రంజీ ట్రోఫీ ఆడటం ప్రారంభించిన 2016-17 కాలంలోనే, పాటిదార్ ఇక్కడ ఉండాల్సిన ఆటగాడు కాదని, భారత జట్టులో క్రమం తప్పకుండా ఆడాల్సిన అగ్రశ్రేణి నాణ్యత కలిగిన క్రికెటర్ అని తామంతా భావించేవాళ్లమని అయ్యర్ గుర్తుచేసుకున్నారు. కొంచెం ఆలస్యమైనప్పటికీ మంచి వ్యక్తులకు చివరికి మంచే జరుగుతుందని, పాటిదార్ జట్టును నడిపించిన తీరు అందరినీ ఆశ్చర్యపరిచిందని ప్రశంసించారు.

ఈ వరుస విజయంతో రజత్ పాటిదార్ ఐపీఎల్ చరిత్రలో ఒక అరుదైన రికార్డును నెలకొల్పారు. ఐపీఎల్‌లో వరుసగా రెండుసార్లు టైటిల్ గెలిచిన కెప్టెన్ల సరసన ఆయన చేరారు. గతంలో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఎంఎస్ ధోని (2010, 2011), ముంబై ఇండియన్స్ తరఫున రోహిత్ శర్మ (2019, 2020) మాత్రమే ఈ ఘనత సాధించగా, ఇప్పుడు పాటిదార్ వారి సరసన నిలిచారు. ఈ విజయంపై పాటిదార్ స్పందిస్తూ, గత ఏడాదితో పోలిస్తే ఈసారి జట్టులో ఒత్తిడి తక్కువగా ఉందని, టోర్నమెంట్ అంతటా తాము ఆధిపత్యం ప్రదర్శించడం వల్ల రెండో టైటిల్ గెలుస్తామనే నమ్మకం తమకు మొదటి నుంచీ ఉందని సంతోషం వ్యక్తం చేశారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ntvtelugu