Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
White House: చైనాలో ట్రంప్ టూర్.. హార్ముజ్‌ జలసంధిపై వైట్‌హౌస్ కీలక ప్రకటన

White House: చైనాలో ట్రంప్ టూర్.. హార్ముజ్‌ జలసంధిపై వైట్‌హౌస్ కీలక ప్రకటన

NTV Telugu 1 week ago

మెరికా అధ్యక్షుడు ట్రంప్ చైనాలో పర్యటిస్తున్నారు. మూడు రోజుల పర్యటన కోసం బుధవారం బీజింగ్‌ చేరుకున్నారు. శుక్రవారం తిరిగి అమెరికాకు వెళ్లున్నారు.

ఇక పర్యటనలో భాగంగా జిన్‌పింగ్‌తో ట్రంప్ కీలక ద్వైపాక్షిక సమావేశం నిర్వహించినట్లుగా వైట్‌హౌస్ పేర్కొంది. ప్రపంచంలోని రెండు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలైన అమెరికా-చైనా మధ్య ఆర్థిక సహకారాన్ని మరింత విస్తరించే దిశగా చర్చలు సానుకూలంగా జరిగాయని వెల్లడించింది.

చైనాలో అమెరికన్ కంపెనీలకు మరింత మార్కెట్ యాక్సెస్ కల్పించడం, అదే సమయంలో అమెరికా పరిశ్రమల్లో చైనా పెట్టుబడులను పెంచే అంశాలపై ఇరు దేశాధినేతలు చర్చించినట్లు తెలిపింది. ఈ సమావేశంలో అమెరికాకు చెందిన పలు దిగ్గజ కంపెనీల ప్రతినిధులు కూడా పాల్గొనడం ప్రాధాన్యత సంతరించుకుంది.

అలాగే అమెరికాలో తీవ్ర ఆందోళన కలిగిస్తున్న ఫెంటానిల్ సంక్షోభంపైనా ఇరు దేశాలు చర్చించాయి. అమెరికాకు అక్రమంగా చేరుతున్న ఫెంటానిల్ తయారీ రసాయనాల ప్రవాహాన్ని అరికట్టేందుకు మరింత కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరంపై ఇరు దేశాలు ఏకాభిప్రాయానికి వచ్చినట్లు వైట్‌హౌస్ పేర్కొంది.

ఈ సమావేశంలో ప్రధానంగా చర్చకు వచ్చిన అంశాల్లో హార్ముజ్ జలసంధి, ప్రపంచ ఇంధన భద్రత కీలకంగా నిలిచాయి. ప్రపంచ ఇంధన సరఫరాలకు అంతరాయం కలగకుండా హార్ముజ్ జలసంధి ఎల్లప్పుడూ తెరిచి ఉండాలని ట్రంప్-జిన్‌పింగ్ ఇద్దరూ అంగీకరించినట్లు తెలిపింది. హార్ముజ్ జలసంధిని సైనికీకరించడాన్ని చైనా వ్యతిరేకించిందని.. అక్కడ టోల్ చార్జీలు విధించే ప్రతిపాదనలకూ కూడా బీజింగ్ అభ్యంతరం వ్యక్తం చేసినట్లు వెల్లడించింది. భవిష్యత్తులో హార్ముజ్‌పై ఆధారాన్ని తగ్గించుకునేందుకు అమెరికా నుంచి మరింత చమురు కొనుగోలు చేసే ఆసక్తిని చైనా వ్యక్తం చేసినట్లు వైట్‌హౌస్ తెలిపింది.

ఇక ఇరాన్ అంశంలో కూడా ఇరు దేశాలు ఒకే అభిప్రాయానికి వచ్చినట్లు వెల్లడించింది. "ఇరాన్ ఎప్పటికీ అణ్వాయుధాలను కలిగి ఉండకూడదు" అనే విషయంలో ట్రంప్, జిన్‌పింగ్ ఇద్దరూ ఏకీభవించినట్లు పేర్కొంది.

ఇదిలా ఉంటే చైనా అధికారిక వార్తా సంస్థ జిన్హువా వార్తా సంస్థ తెలిపిన వివరాల ప్రకారం.. బీజింగ్‌లోని స్వర్గ దేవాలయంను సందర్శించిన ట్రంప్.. 600 ఏళ్ల తర్వాత కూడా ఆ ఆలయం అద్భుతంగా నిలిచి ఉండటం తనను ఆశ్చర్యానికి గురి చేసిందని వ్యాఖ్యానించారు. చైనా సాంప్రదాయ శిల్పకళ వైభవాన్ని అది ప్రతిబింబిస్తోందని కొనియాడారు. దీనికి స్పందించిన జిన్‌పింగ్.. పురాతన చైనా రాజులు దేశ శాంతి, ప్రజల శ్రేయస్సు కోసం అక్కడ యాగాలు నిర్వహించేవారని తెలిపారు. "ప్రజలే దేశానికి పునాది.. పునాది బలంగా ఉంటే దేశం స్థిరంగా ఉంటుంది" అనే సంప్రదాయ చైనా ఆలోచనకు అది ప్రతీక అని పేర్కొన్నట్లు వార్తా సంస్థ వెల్లడించింది. అలాగే 2017లో తాను Forbidden Cityను సందర్శించిన విషయాన్ని ఇప్పటికీ స్పష్టంగా గుర్తు పెట్టుకున్నానని ట్రంప్ చెప్పినట్లు నివేదిక పేర్కొంది.

పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతలు, ఇంధన భద్రతపై ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఆందోళనలు, వాణిజ్య యుద్ధాల తర్వాత అమెరికా-చైనా సంబంధాలను మళ్లీ గాడిలో పెట్టే ప్రయత్నాల మధ్య ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.

ట్రంప్ ప్రకటన
ఇక చైనా ప్రతినిధి బృందంతో జరిగిన చర్చలపై ట్రంప్ సానుకూల వ్యాఖ్యలు చేశారు. ''ఈరోజు చైనా ప్రతినిధి బృందంతో మా సమావేశాలు, చర్చలు అత్యంత సానుకూలంగా, ఫలప్రదంగా జరిగాయి. ఈ సాయంత్రం కూడా మిత్రుల మధ్య మరికొన్ని కీలక అంశాలపై చర్చించేందుకు మంచి అవకాశం లభించింది. ఇవన్నీ అమెరికా, చైనా రెండు దేశాలకు కూడా మేలు చేసే అంశాలే. మీతో కలిసి ఉండటం నాకు గొప్ప గౌరవంగా భావిస్తున్నాను" అని ట్రంప్ పేర్కొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ntvtelugu