Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Work From Home ఇచ్చేందుకు కంపెనీలు సుముకంగాలేవా..?

Work From Home ఇచ్చేందుకు కంపెనీలు సుముకంగాలేవా..?

NTV Telugu 1 week ago

దేశంలో పెరుగుతున్న ఇంధన వినియోగాన్ని తగ్గించి, ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే దిశగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక కీలక ప్రతిపాదనను ముందుకు తీసుకువచ్చారు.

ఉద్యోగులు వీలైనంత వరకు ఇంటి నుండే పని చేసే (Work From Home) విధానాన్ని పాటించాలని ఆయన సూచించారు. ఈ నేపథ్యంలో, దేశీయ ఐటీ హబ్‌లలో ఒకటైన హైదరాబాద్‌పై ఈ నిర్ణయం ఎలాంటి ప్రభావం చూపుతుందనే అంశంపై ఆసక్తికర చర్చ జరుగుతోంది.

హైదరాబాద్ నగరంలో ప్రస్తుతం సుమారు 9 లక్షల మంది ఐటీ ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీరిలో మెజారిటీ ఉద్యోగులు తమ కార్యాలయాలకు చేరుకోవడానికి ప్రతిరోజూ సగటున 50 కిలోమీటర్ల మేర ప్రయాణిస్తున్నారు. ఈ సుదీర్ఘ ప్రయాణం వల్ల అటు ట్రాఫిక్ సమస్యలు పెరగడమే కాకుండా, భారీగా ఇంధనం ఖర్చవుతోంది. ప్రధాని సూచన మేరకు వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాన్ని అమలు చేస్తే ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

హైదరాబాద్ ఐటీ రంగంలో ఈ విధానం వల్ల కలిగే ఆర్థిక ప్రయోజనాలపై ప్రాథమిక అంచనాలు వెలువడ్డాయి. నగరంలోని మొత్తం ఐటీ ఉద్యోగులలో కనీసం సగం మంది, అంటే సుమారు 4.5 లక్షల మంది వారానికి కేవలం మూడు రోజులు ఇంటి నుండి పని చేసినా అద్భుతమైన ఫలితాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల నెలకు దాదాపు 140 కోట్ల రూపాయల విలువైన ఇంధనం ఆదా అయ్యే అవకాశం ఉందని అంచనా. ఇది దేశీయ ఆర్థిక వ్యవస్థకు పెద్ద ఊరటనిస్తుందని భావిస్తున్నారు.

కోవిడ్ సమయంలో వర్క్ ఫ్రమ్ హోమ్ విధానం విజయవంతంగా అమలు జరిగినప్పటికీ, ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఐటీ కంపెనీలు ఈ విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నాయి. పెద్ద కంపెనీలు ప్రభుత్వ నిర్ణయం కోసం వేచి చూస్తుండగా, కొన్ని చిన్న స్థాయి సంస్థలు మాత్రం ఈ విధానం వల్ల తమ ఉత్పాదకత దెబ్బతింటుందని లేదా ఇతర నష్టాలు వస్తాయని ఆందోళన చెందుతున్నాయి. ప్రభుత్వం నుండి స్పష్టమైన మార్గదర్శకాలు వస్తే తప్ప ఈ విషయంలో క్లారిటీ వచ్చేలా లేదు.

కేవలం వర్క్ ఫ్రమ్ హోమ్ మాత్రమే కాకుండా, పెట్రోల్ , డీజిల్ వాహనాల స్థానంలో ఎలక్ట్రిక్ వాహనాలను (EV) ప్రోత్సహించడం కూడా అత్యవసరమని నిపుణులు సూచిస్తున్నారు. ఇంటి నుండే పని చేయడం వల్ల ఇంధన దిగుమతులు తగ్గి, అంతర్జాతీయ మార్కెట్‌లో భారత రూపాయి విలువ పెరగడానికి తోడ్పడుతుందని వారు అభిప్రాయపడుతున్నారు. పర్యావరణ పరిరక్షణతో పాటు దేశ ఆర్థిక భవిష్యత్తుకు ఈ ‘వర్క్ ఫ్రమ్ హోమ్’ విధానం ఒక కీలక మలుపు కానుంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ntvtelugu