YS Jagan Emotional Tweet on YSR Vardhanthi 2026: దివంగత మహానేత, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి నేడు. ఈ సందర్భంగా ఆయన తనయుడు, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ భావోద్వేగానికి గురయ్యారు.
తన తండ్రిని స్మరించుకుంటూ సోషల్ మీడియా వేదిక 'ఎక్స్'లో భావోద్వేగ సందేశాన్ని పోస్టు చేశారు. వైఎస్సార్ తనకు ఎప్పటికీ స్ఫూర్తిగానే ఉంటారని, ఆయన జ్ఞాపకాలు ఎల్లప్పుడూ తనతోనే ఉంటాయని పేర్కొన్నారు.
'నాన్నా.. మిమ్మల్ని ఎప్పటికీ మిస్ అవుతూనే ఉంటాను. మీరు ఎప్పటికీ నా స్ఫూర్తి. మీ జ్ఞాపకాలు ఎల్లప్పుడూ నాతోనే ఉంటాయి' అంటూ వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. తండ్రిపై తనకున్న అనుబంధాన్ని, అభిమానాన్ని మరోసారి వ్యక్తం చేశారు. అంతకుముందు వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా ఉదయం ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద జగన్ నివాళులు అర్పించారు. తండ్రి సమాధి వద్ద పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి వైఎస్ కుటుంబ సభ్యులతో పాటు వైఎస్సార్సీపీకి చెందిన పలువురు నేతలు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
వైఎస్సార్ వర్ధంతిని పురస్కరించుకుని రాష్ట్రబి వ్యాప్తంగా వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పలుచోట్ల వైఎస్సార్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పిస్తున్నారు. వైఎస్సార్ చేసిన సేవలను, ఆయన పాలనలో చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలను గుర్తు చేసుకుంటున్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి 2009 సెప్టెంబర్ 2న హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందారు. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 2న ఆయన వర్ధంతిని కుటుంబ సభ్యులు, పార్టీ శ్రేణులు, అభిమానులు ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద ఘనంగా నిర్వహిస్తూ వస్తున్నారు.

