Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఆ 38 మంది పాకిస్థాన్ ఉగ్రవాదులకు తగిన శాస్తి.. ఇన్నాళ్లకు అహ్మదాబాద్ మృతుల ఆత్మ కు శాంతి

ఆ 38 మంది పాకిస్థాన్ ఉగ్రవాదులకు తగిన శాస్తి.. ఇన్నాళ్లకు అహ్మదాబాద్ మృతుల ఆత్మ కు శాంతి

Oktelugu.com 1 week ago

Ahmedabad Bomb Blasts Verdict: అది మామూలు దారుణం కాదు. మాటలకందని విషాదం. కనీ విని ఎరుగని రక్తపాతం. అయిన వాళ్ళని కోల్పోయి.. ఆర్త నాదాలు పెడుతూ..

అహ్మదాబాద్ నగరం శోక సంద్రంలో మునిగిపోయింది. ఒకరు కాదు ఇద్దరు కాదు.. 56 మంది చనిపోయారు.. ఉగ్రవాదులు బాంబులు పేల్చివేసి అహ్మదాబాద్ నగరంలో నరమేధం సృష్టించారు. ఈ దారుణం భారతదేశ చరిత్రలో ఒక చీకటి అధ్యాయం లాగా.. నెత్తుటి జ్ఞాపకంలాగా మిగిలిపోయింది.

ఈ వ్యవహారం అప్పట్లో దేశంలో సంచలనం సృష్టించింది. ఆ తర్వాత ఉగ్రవాద వ్యతిరేక బృందాలు రంగంలోకి దిగి కేసు దర్యాప్తు చేశాయి. పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులను పట్టుకున్నాయి. మొత్తం 49 మందిని దర్యాప్తు బృందం అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అనేక రకాలుగా దర్యాప్తు చేపట్టారు. కీలక ఆధారాలు సేకరించారు. ఆ తర్వాత న్యాయస్థానాలలో ఆధారాలను న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెట్టారు.. అనేక దఫాలుగా విచారణ పూర్తయిన తర్వాత.. ఆ 49 మంది విషయంలో గుజరాత్ న్యాయస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. మంగళవారం సంచలన తీర్పును వెల్లడించింది.

2008 జూలై 26న అహ్మదాబాద్ నగరంలో ఉగ్రవాదులు వరుసగా బాంబు పేలుళ్లు జరిపారు. ఈ దారుణంలో 56 మంది చనిపోయారు. రెండు వందల మందికి పైగా గాయపడ్డారు. 70 నిమిషాల వ్యవధిలో ఏకంగా 21 బాంబులను పేల్చేశారు. ఈ దారుణం మాపని అని హర్కత్ ఉల్ అల్ ఇస్లామి అనే ఇస్లామిక్ టెర్రర్ గ్రూప్ దీనికి బాధ్యత వహిస్తున్నట్టు వెల్లడించింది. ఈ కేసు తీవ్రత దృష్ట్యా గుజరాత్ కోర్టు కీలకతీర్పును వెల్లడించింది. 38 మందికి మరణశిక్ష విధిస్తూ నిర్ణయం తీసుకుంది. 11 మందికి జీవిత ఖైదు విధించింది.

ఆ 38 మంది దేశంలో దారుణానికి పాల్పడ్డారని.. అమాయకులను ప్రజలను చంపేశారని.. అటువంటి వ్యక్తులకు కనీసం బతికే హక్కు కూడాలేదని న్యాయస్థానం తన తీర్పులో ఘాటుగా వ్యాఖ్యానించింది. అంతేకాదు ఇటువంటి వ్యక్తులు సమాజానికి బద్ధ శత్రువులు అని పేర్కొంది. ఈ తీర్పుతో నాడు అహ్మదాబాద్ ఘటనలో చనిపోయిన వారి ఆత్మలకు శాంతి కలుగుతుందని.. వారి బంధువులు పేర్కొంటున్నారు. కోర్టు తీర్పు అనంతరం వారు సంతృప్తి వ్యక్తం చేశారు. చనిపోయిన వాళ్లను తలుచుకొని కన్నీటి పర్యంతమయ్యారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Oktelugu.com