AP Assembly: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో రేపు సంచలనం నమోదయ్యే అవకాశం ఉంది. నిన్ననే అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన సంగతి తెలిసిందే. నాలుగు రోజులపాటు ఈ సమావేశాలు జరగనున్నాయి.
అయితే తొలి రోజు నుంచే డీఎస్సీ 2025 పై బలమైన చర్చ ప్రారంభం అయింది. డీఎస్సీలో అక్రమాలు జరిగాయని.. అది మెగా డీఎస్సీ కాదని.. దగడిఎస్సి అంటూ వైసీపీ ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. రాష్ట్రవ్యాప్త ఆందోళనలకు శ్రీకారం చుట్టింది ఆ పార్టీ. మరోవైపు మండలిలో దీనిపై గట్టిగానే నిలదీసే ప్రయత్నం చేసింది. ఇంకోవైపు శాసనసభలో విద్యాశాఖ మంత్రిగా ఉన్న లోకేష్ సుదీర్ఘంగా దీనిపై వివరణ ఇచ్చారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అనవసరంగా బురద జల్లుతోందని.. దమ్ముంటే గొడ్డలి పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి వచ్చి ఈ చర్చలో పాల్గొనాలంటూ సవాల్ చేశారు. ఇటువంటి పరిస్థితుల్లో రేపు ఏపీ అసెంబ్లీలో ఓ సంచలన అంశాన్ని ప్రభుత్వం బయటపెట్టే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది.
* కొనసాగిన సిట్ దర్యాప్తు..
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో జరిగిన గ్రూప్ వన్ పరీక్షల్లో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలు ఉన్నాయి. కూటమి వచ్చిన తర్వాత ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. అవకతవకలపై విచారించేందుకుగాను ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించింది. గత కొద్ది రోజులుగా ఈ విచారణ కొనసాగుతూ వచ్చింది. మొన్ననే కోర్టులో చార్ట్ సీట్ దాఖలు చేస్తూ.. సంచలన అంశాలను నివేదించింది ప్రత్యేక దర్యాప్తు బృందం. అడుగడుగునా అక్రమాలు చోటు చేసుకున్నాయని చెప్పింది. మూడుసార్లు మూల్యాంకనం చేసినట్లు గుర్తించింది. ఓ 60 వరకు పరీక్షల పత్రాల్లో వైట్నర్ వినియోగించారని ప్రస్తావించింది. ప్రొఫెసనల్స్ ను పక్కన పెట్టి డేటా ఎంట్రీ ఆపరేటర్లతో నమోదు కార్యక్రమాన్ని చేశారని గుర్తించగలిగింది సిట్. ఎవరెవరైతే కోర్టులకు వెళ్లారో వారి పత్రాల విషయంలో కూడా అనేక మార్పులు చేర్పులు చేశారని సిట్ తన నివేదికలో కోర్టుకు నివేదించింది.
* సభలో చర్చించే ఛాన్స్..
అయితే వైయస్సార్ కాంగ్రెస్ డిఎస్సి 2025 పై ఆరోపణలు చేస్తోంది. అయితే అవి ఆధారాలు లేని అనుమానాలు మాత్రమే. అందుకే న్యాయస్థానాలు సైతం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు వేసిన పిటిషన్ ను పరిగణలోకి తీసుకోలేదు. విచారణ చేపట్టక మునుపే వాటిని కొట్టి వేసింది. అయితే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఎక్కడ వెనక్కి తగ్గడం లేదు. అదే పనిగా డీఎస్సీ 2025 పై బురద జల్లుతూనే ఉంది. ఈ క్రమంలో ప్రభుత్వం వైసిపి హయాంలో జరిగిన గ్రూప్ వన్ అవకతవకలపై రేపు సభలోనే పూర్తి ప్రకటన చేసే అవకాశం ఉంది. ఆధారాలను బయటపెట్టి మరి ఎండగట్టే ఛాన్స్ కనిపిస్తోంది. మరోవైపు నేషనల్ మీడియాలో సైతం వైసీపీ హయాంలో జరిగిన గ్రూప్ వన్ పరీక్షల అవకతవకల పైనే కథనాలు వస్తున్నాయి. ఈ పరిణామాల క్రమంలో పరిస్థితులు చూస్తుంటే మాత్రం రేపు ఏపీ అసెంబ్లీలో సంచలనాలు నమోదయ్యే ఛాన్స్ ఎక్కువ.

