AP Heavy Rain Alert: ఏపీలో ఒక్కసారిగా వాతావరణం మారింది. శనివారం భారీ వర్షాలు నమోదయ్యాయి. చాలా ప్రాంతాల్లో ఆదివారం తెల్లవారుజాము వరకు వర్షాలు కొనసాగాయి.
ఉత్తరాంధ్రలో విస్తారంగా వర్షాలు పడ్డాయి. తూర్పు విదర్భ, దక్షిణ చత్తీస్గడ్ మీదుగా ఏపీ తీర ప్రాంతం వరకు ఒక ఉపరితల ద్రోణి విస్తరించి ఉంది. దీని ప్రభావంతో రాబోయే కొన్ని గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా మరిన్ని వర్షాలు కురిసే అవకాశం ఉంది. విపత్తుల నిర్వహణ సంస్థ కీలక సూచనలు చేస్తోంది. ఆదివారం సైతం విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరిస్తోంది. అందుకే జిల్లాల వారీగా అలర్ట్ జారీ చేస్తోంది.
* పశ్చిమగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తోంది.
* కాకినాడ తో పాటు తూర్పుగోదావరి జిల్లాకు ఎల్లో అలర్ట్ జారీ అయింది. ఇక్కడ ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది.
* మరోవైపు రాయలసీమకు సైతం భారీ వర్ష సూచన ఉంది. ఆదివారం బలమైన ఈదురుగాలులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మిగిలిన జిల్లాల్లో తేలికపాటి జల్లులు పడవచ్చు. వర్షంతో పాటు పిడుగులు పడే సూచన కూడా ఉంది.
* మరోవైపు బాపట్ల, నెల్లూరు, రాయలసీమ ప్రాంతాల్లో ఎక్కువగా పిడుగులు పడతాయని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరిస్తోంది. మచిలీపట్నం, ఏలూరు, నరసాపురం, దివిసీమ, గుడివాడ, భీమడోలు ప్రాంతాలకు సైతం పిడుగుల హెచ్చరికలు ఉన్నాయి. వర్షం ప్రారంభమైన తర్వాత రైతులు, రైతు కూలీలు ఇళ్లకు చేరుకోవాలని సూచిస్తోంది.
* విశాఖ జిల్లాలో భారీ వర్షం కురిసింది శనివారం మధ్యాహ్నం. ఉష్ణోగ్రతలతో ఇబ్బంది పడిన జనం ఉపశమనం పొందారు. విశాఖ నగరంలో రాత్రి ఏడు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు విస్తారంగా వర్షాలు పడ్డాయి. నగరంలో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. పూర్ణ మార్కెట్లో దారులన్నీ మునిగాయి. జైలు రోడ్డు పరిసరాల్లో అత్యధికంగా 59 మిల్లీమీటర్లు, ప్రభుత్వ ఐ హాస్పిటల్ ప్రాంతంలో 53.7 మిల్లీమీటర్లు, ఆర్కే బీచ్ పరిసరాల్లో 47.8 మిల్లీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదయింది.

