Vaibhav Suryavanshi: కనికరం లేదు.. దయా దాక్షిణ్యం లేదు. భయం అనేది లేదు. బెరుకు కనిపించడం లేదు. అతడికి తెలిసింది కేవలం ఒకటే కొట్టుడు. బీభత్సంగా బాదుడు..
ఈ సిద్ధాంతాన్ని అద్భుతంగా అమలు చేస్తున్నాడు. ప్రారంభం నుంచి ఇప్పటివరకు అదే టెంపో కొనసాగిస్తున్నాడు. అందువల్లే ఐపిఎల్ లో విధ్వంస కారుడిగా ముద్ర వేసుకున్నాడు.
ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో వైభవ్ సూర్యవంశీ జోరు కొనసాగుతోంది. ఈ 15 సంవత్సరాల బాలుడు అద్భుతాల మీద అద్భుతాలు చేస్తున్నాడు. ఇప్పటివరకు అతడు 245 బంతులు ఎదుర్కొన్నాడు. ఇందులో 53 సిక్సర్లు.. 50 ఫోర్లు ఉన్నాయి. మొత్తంగా అతడు 579 పరుగులు చేశాడు. ప్రతి మూడు బంతుల్లో ఒకదానిని బౌండరీగా తరలిస్తున్నాడు. ఈ సీజన్లో 237 స్ట్రైక్ రేట్ తో 500 కు పైగా పరుగులు చేయడం టోర్నీలో ఇదే తొలిసారి. వైభవ్ ఇంకా 47 పరుగులు చేస్తే.. ఈ సీజన్లో అత్యధికంగా పరుగులు చేసిన అన్ క్యాప్డ్ ఆటగాడిగా జైస్వాల్ (625) రికార్డు బద్దలు కొడతాడు.
మంగళవారం లక్నో జట్టుతో జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన లక్నో ఐదు వికెట్ల నష్టానికి 220 పరుగులు చేసింది. లక్నో ఆటగాడు మార్ష్(96) పరుగులు చేశాడు.. ఇంగ్లీస్ (60), రిషబ్ పంత్ (35) రన్స్ చేశారు. 221 పరుగుల లక్ష్యంతో రంగంలోకి దిగిన రాజస్థాన్ జట్టుకు జైస్వాల్ (43), సూర్య వంశీ (93) తిరుగులేని పునాది వేశారు. వీరిద్దరి తొలి వికెట్ కు 6.3 ఓవర్లలో 75 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. రెండో వికెట్ జూరెల్ (53) తో కలిసి సూర్య వంశీ 105 పరుగులు జోడించాడు. సూర్య వంశీ అవుట్ అయిన తర్వాత.. ఫెరీర(16*) మిగతా బాధ్యతను పూర్తి చేశాడు. ఈ విజయంతో రాజస్థాన్ రాయల్స్ పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి చేరుకుంది. ఇప్పటివరకు 13 మ్యాచులు ఆడిన రాజస్థాన్ ఏడు విజయాలు సాధించింది. రాజస్థాన్ జట్టు నెట్ రన్ రేట్+0.083 తో కొనసాగుతోంది. రాజస్థాన్ జట్టు తన తదుపరి మ్యాచ్ మే 24న ముంబై ఇండియన్స్ తో ఆడుతుంది. ఈ మ్యాచ్ గెలిస్తే.. మిగతా జట్ల ఫలితంతో సంబంధం లేకుండా ప్లే ఆఫ్ వెళ్తుంది.

