Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
త్వరలో ఆ మాజీ ఎంపీ టీడీపీలోకి..

త్వరలో ఆ మాజీ ఎంపీ టీడీపీలోకి..

Oktelugu.com 3 weeks ago

Kesineni Nani: రాజకీయాల్లో కొందరు దురదృష్టవంతులు ఉంటారు. అప్పటివరకు గెలిచిన పార్టీలో ఉండి.. ఎన్నికల ముంగిట ఓడిపోయే పార్టీలో చేరుతుంటారు. ఇలా మూల్యం చెల్లించుకున్న నేతలు ఎంతోమంది ఉన్నారు.

అటువంటి వారిలో విజయవాడ మాజీ ఎంపీ కేసినేని నాని ఒకరు. దాదాపు పది సంవత్సరాలు పాటు టిడిపి ఎంపీగా ఉన్నారు నాని. రెండోసారి గెలిచేసరికి ఆయన టిడిపి నాయకత్వంతో విభేదించారు. విజయవాడ రాజకీయాలతో తెలుగుదేశం పార్టీకి దూరమయ్యారు. అనివార్య పరిస్థితుల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. మూడోసారి ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. అయితే అవమానాన్ని తట్టుకోలేక రాజకీయాలనుంచి దూరమవుతున్నట్లు ప్రకటించారు. అయితే మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఆయన టిడిపి నాయకత్వానికి దగ్గరయ్యే ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రచారం నడుస్తోంది.

* ట్రావెల్స్ రంగంలో..
ట్రావెల్స్ రంగంలో కేశినేని నాని( Kesineni Nani ) ఉండేవారు. కేశినేని ట్రావెల్స్ ద్వారా సూపరిచితులు. 2009లో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ ఏర్పాటు చేయడంతో ఆ పార్టీలో చేరారు. ఆ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. తర్వాత చంద్రబాబు ఆహ్వానం మేరకు తెలుగుదేశం పార్టీలో చేరారు. 2014లో టికెట్ దక్కించుకొని విజయవాడ ఎంపీ అయ్యారు కేసినేని నాని. ఐదేళ్లపాటు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశారు. టిడిపి నాయకత్వంతో సైతం సమన్వయం చేసుకునేవారు. అధినేత చంద్రబాబుకు దగ్గరగా ఉండేవారు. అయితే 2019లో జగన్ ప్రభంజనంలో సైతం కేసినేని నాని రెండోసారి గెలిచారు. గెలిచిన నాటి నుంచి ఆయన స్వరం మారింది. తన సొంత చరిష్మతో గెలిచినట్లు ఆయన భావించారు. ముఖ్యంగా విజయవాడలో లోకల్ పాలిటిక్స్ తో ఏకంగా అధినేత కుమారుడు లోకేష్ ను విభేదించడం ప్రారంభించారు. అలా పార్టీకి దూరమయ్యారు. అయితే ఇదే అదునుగా ఆయన తమ్ముడు చిన్ని పార్టీలో యాక్టివ్ అయి సోదరుడు నాని పై టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఎంపీగా గెలిచారు. దానిని తట్టుకోలేక రాజకీయాలనుంచి దూరమయ్యారు నాని.

* కొంచెం సాఫ్ట్ కార్నర్..
ప్రత్యేక పరిస్థితుల్లోనే కేశినేని నాని టిడిపికి దూరమయ్యారు. చంద్రబాబు( CM Chandrababu) విషయంలో ఆయన సానుకూలంగానే ఉండేవారు. కానీ కృష్ణ జిల్లాలో మిగతా టిడిపి నేతలతో ఆయనకు అంతగా పడేది కాదు. గతంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా విజయవాడ నగర మేయర్ టిడిపి అభ్యర్థిగా నాని కుమార్తెను ప్రకటించారు చంద్రబాబు. అయితే కొందరు కావాలనే ఓడించారని టిడిపి నేతలపై ఆయనకు కోపం ఉండేది. అటువంటి వారికి లోకేష్ ప్రోత్సాహం ఉందన్నది కేసినేని నాని లో అనుమానం. అప్పట్లో ఆయన అలా పార్టీకి దూరమయ్యారు. అయితే మరోసారి తన కుమార్తెకు విజయవాడ మేయర్ అభ్యర్థిగా ప్రకటిస్తే టిడిపిలోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు నాని చంద్రబాబుకు విన్నవించినట్లు తెలుస్తోంది. ఒకవేళ చంద్రబాబు దయ తలిస్తే మాత్రం కేశినేని నాని టిడిపిలోకి ఎంట్రీ ఖాయం. చూడాలి మరి ఏం జరుగుతుందో..

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Oktelugu.com