Vallabhaneni Vamsi Mohan: ఆత్మాభిమానం తాకట్టు పెడితే కచ్చితంగా బానిసలు కావాల్సిందే. ఇప్పుడు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో వల్లభనేని వంశీ మోహన్ లాంటి వారి పరిస్థితి అదే.
అధినేత జగన్మోహన్ రెడ్డి కోసం తన సొంత నియోజకవర్గం గన్నవరం ఎయిర్పోర్ట్ లో బారికేడ్లు వెనుక.. సామాన్య కార్యకర్తలతో కలిసి వల్లభనేని వంశీ మోహన్ ఉండిపోయారు అంటే పరిస్థితి ఎంత దాకా వచ్చిందో అర్థం అవుతుంది. అధినేత కళ్ళల్లో పడేందుకు వల్లభనేని వంశీ మోహన్ చేసిన ప్రయత్నం.. కేవలం సెకండ్లు మాత్రమే మాట్లాడి వెళ్లిపోయిన జగన్.. ఇలా అక్కడ పరిస్థితి చూస్తుంటే మాత్రం కడుపు తరుక్కు పోతుంది. అయితే ఇది చేజేతులా వల్లభనేని వంశీ మోహన్ చేసుకున్న స్వయంకృతాపమే. మొత్తం పరిణామాలు చూస్తే ఆయన ఈజీగా జగన్మోహన్ రెడ్డి ట్రాప్ లో పడ్డారు.. ఇప్పుడు పడరాని పాట్లు పడుతున్నారు. ఊబిలో నుంచి బయటకు రాలేరు. అందులో ఉండలేరు అన్నట్టు ఉంది పరిస్థితి. అయితే ఈ దుస్థితిని చూసిన చాలామంది వల్లభనేని వంశీ మోహన్ టిడిపిలో ప్రయాణం గురించి ప్రస్తావన తెస్తున్నారు.
* అప్పట్లో విజయవాడ ఎంపీగా..
అది 2009 కాలం. ప్రజారాజ్యం పార్టీ ఆవిర్భవించింది. ఒకవైపు అధికార కాంగ్రెస్ పార్టీ ఉంది. ఇంకో వైపు టిడిపి నేతృత్వంలోని మహాకూటమి అవతరించింది. రెండోసారి ఓటమి ఎదురు కాకుండా ఉండాలి అంటే బలమైన అభ్యర్థులను బరిలోదించాలి. ఆ సమయంలో చంద్రబాబు చాలా విధాలుగా అభ్యర్థుల మదింపు జరుగుతోంది. ఆ సమయంలోనే విజయవాడ పార్లమెంట్ అభ్యర్థిగా వల్లభనేని వంశీ మోహన్ ను ఎంపిక చేశారు చంద్రబాబు. సిట్టింగ్ ఎంపీగా లగడపాటి రాజగోపాల్ ఉన్నారు. ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థిగా కేసినేని నాని పోటీ చేస్తున్నారు. అటువంటి సమయంలో కొత్తవాడిగా వల్లభనేని వంశీ మోహన్ పై నమ్మకంతో టిక్కెట్ ఇచ్చారు చంద్రబాబు. కానీ ఆ ఎన్నికల్లో రెండో స్థానానికి పరిమితం అయ్యారు వల్లభనేని వంశీ మోహన్.
* సీనియర్లను కాదని..
కృష్ణా జిల్లాలో గన్నవరం నియోజకవర్గం టిడిపికి కంచుకోట. 1983 నుంచి తెలుగుదేశం పార్టీ మాత్రమే అక్కడ గెలుస్తూ వస్తోంది. ఆరుసార్లు ఆ పార్టీ విజయం సాధించింది. అయితే 2009లో విజయవాడ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు వల్లభనేని వంశీ మోహన్. 2014లో మాత్రం గన్నవరం నుంచి ఛాన్స్ ఇచ్చారు చంద్రబాబు ఆయనకు. అప్పటికే అక్కడ టిడిపికి సీనియర్ మోస్ట్ లీడర్లు ఉన్నారు. వారందరినీ కాదని వల్లభనేని వంశీ మోహన్ కు అవకాశం కల్పించారు చంద్రబాబు. అప్పటికే వల్లభనేని వంశీ మోహన్ కు అత్యంత సన్నిహితుడు కొడాలి నాని టిడిపికి గుడ్ బై చెప్పారు. ఆ సమయంలో అసలు వల్లభనేని వంశీ మోహన్ కు టికెట్ ఇవ్వకూడదు. అయినా సరే టిక్కెట్ ఇచ్చి గెలిపించుకున్నారు. ఐదు సంవత్సరాల పాటు అధికారాన్ని వెలగబెట్టారు వంశీ మోహన్.
* వైసీపీలోకి ఫిరాయింపు..
2019 ఎన్నికల్లో సైతం వల్లభనేని వంశీ మోహన్ కు రెండోసారి గన్నవరం టిక్కెట్ ఇచ్చారు చంద్రబాబు. అప్పటికే కొడాలి నాని చంద్రబాబుతో పాటు లోకేష్ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు. అదే కొడాలి నానితో వల్లభనేని వంశీ మోహన్ సాన్నిహిత్యం కొనసాగుతూ వచ్చింది. అయినా సరే రాజకీయం వేరు.. స్నేహం వేరు అని భావించారు చంద్రబాబు. 2019 ఎన్నికల్లో టిక్కెట్ ఇచ్చారు. టిడిపి ఓడిపోయి వైసిపి గెలిచేసరికి వల్లభనేని వంశీ స్వరం మారిపోయింది. ఇన్ని రోజులు తనకు లభించిన ఆదరణను మరిచిపోయి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. చంద్రబాబుతో పాటు లోకేష్ లపై వ్యక్తిగత విమర్శల దాడి చేశారు. వైసీపీ నుంచి 2024 ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. తన వ్యక్తిగత వ్యవహార శైలి మూలంగా కేసులకు గురయ్యారు. 150 రోజుల పాటు జైల్లో ఉండి పోయారు. అనారోగ్యానికి కూడా గురయ్యారు. అయితే ఇప్పుడు అదే వల్లభనేని వంశీ కి వైసీపీ తప్ప మరో ఆప్షన్ లేదు. ఈ విషయం తెలిసి జగన్మోహన్ రెడ్డి కనీసం ఆయనకు అపాయింట్మెంట్ ఇవ్వడం లేదు. దీంతో ఎలాంటి వల్లభనేని వంశీ మోహన్ ఎలా అయిపోయారు అనే చర్చ జరుగుతోంది.

