Nagamani Malligari August 1, 2026prabhanews.com
ఇద్దరు నిరుపేద విద్యార్థులను దత్తత తీసుకున్న మర్రి రవికుమార్
ఎల్కతుర్తి, ఆంధ్రప్రభ: హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం దామెర ప్రాథమిక పాఠశాలలో శనివారం మర్రి రవికుమార్ ఆధ్వర్యంలో విద్యార్థులకు నోట్బుక్స్, పెన్నుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా మర్రి రవికుమార్ మాట్లాడుతూ చదువులో వెనుకబడిన విద్యార్థులకు అండగా నిలవడం తన బాధ్యతగా భావిస్తున్నానని తెలిపారు. అనంతరం 5వ తరగతి విద్యార్థిని మోక్షిత, 3వ తరగతి విద్యార్థి రుత్విక్ అనే ఇద్దరు నిరుపేద విద్యార్థులను దత్తత తీసుకుంటున్నట్లు ప్రకటించారు.
వారి ఉన్నత విద్య పూర్తయ్యే వరకు అవసరమైన నోట్బుక్స్, దుస్తులు, విద్యా ఫీజులతో పాటు ఇతర విద్యా అవసరాలన్నింటినీ తానే భరిస్తానని స్పష్టం చేశారు.
నిరుపేద విద్యార్థుల విద్యాభివృద్ధికి మర్రి రవికుమార్ అందిస్తున్న సహకారం అభినందనీయమని పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎర్ర తిరుపతి, ఉపాధ్యాయులు రాజేశ్వరి, జయప్రద, గ్రామ సర్పంచ్ మంకని పద్మ కొనియాడారు. విద్యార్థుల తల్లిదండ్రులు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు.

