మౌలిక సదుపాయాలపై ప్రభుత్వ వ్యయాన్ని, ఆర్థిక వృద్ధి వేగాన్ని కొనసాగించడం కోసం 2021-22 బడ్జెట్పై దృష్టి పెడ్తామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. కోవిడ్ 19 మహమ్మారి కారణంగా పెట్టుబడులు కూడా ప్రభావితం అయ్యాయని తెలిపారు. రాబోయే బడ్జెట్ 2021-22 కోసం సోమవారం హస్తిన నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్ర, కేంద్ర పాలిత ప్రాంతాల ఆర్థిక శాఖ మంత్రులతో కేంద్ర విత్త మంత్రి నిర్మలా సీతారామన్ ముందస్తు బడ్జెట్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అన్నీ రాష్ట్రాల ఆర్థిక మంత్రుల సలహాలు, సూచనలను స్వీకరించారు.
బడ్జెట్ రూప కల్పనలో అవసరమైన కేటాయింపులు వంటి అంశంపై కూడా నిర్మలా సీతారామన్ వారితో చర్చించారు.
కరోనా మహమ్మారికి వ్యతిరేకంగా గట్టిగా పోరాడేందుకు కేంద్రం అన్ని రాష్ట్ర, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఎంతో మద్దతు ఇచ్చిందని గుర్తు చేశారు. మహమ్మారి కారణంగా దేశ ఆర్థిక వ్యవస్థ మందగించినా.. ఆయా రాష్ట్రాల, కేంద్ర పాలిత ప్రాంతాలు ఎంతో సహకరించాయని తెలిపారు. రుణాలు తీసు కునే పరిమితులు పెంచడం జరిగిందని, రాష్ట్రాలకు తిరిగి రుణాలు అందించామన్నారు.
ఈ భేటీలో వివిధ రాష్ట్రాల, కేంద్ర పాలిత ప్రాం తాల సీఎంలు, డిప్యూటీ సీఎంలు, ఆర్థిక మంత్రులు, సీనియర్ అధికా రులు పాల్గొన్నారు. ప్రతీ ఏడాది ఫిబ్రవరి 1న బడ్జెట్ ప్రవేశపెడ్తారు. ఇందుకోసం ప్రతీ ఏడాది బడ్జెట్ ముందు మంత్రులతో సమావేశాలు నిర్వహిస్తారు. ఇందులో బడ్జెట్ సూచనలు, సలహాలు తీసుకుంటారు. ఈ ఏడాది కరోనా వైరస్ కారణంగా దేశ ఆర్థిక వ్యవస్థ తీవ్ర దెబ్బతిన్న నేపథ్యంలో.. బడ్జెట్ ముందస్తు భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది.

