
అనంతపురం : కరోనా నేపథ్యంలో కొత్తగా వ్యాక్సినేషన్ ప్లాన్ను ఈ నెల 10 నుంచి 31వ తేదీ వరకు అమలు చేస్తున్నామని, ఇందులో భాగంగా ఈనెల 11తేదీ మంగళవారం నుంచి జిల్లాలో సెకండ్ డోస్ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు జాయింట్ కలెక్టర్ ఎ.సిరి పేర్కొన్నారు. ఆదివారం స్థానిక ఎడిసిసి బ్యాంక్ కార్యాలయంలో వ్యాక్సినేషన్ అంశంపై డిఎంఅండ్హెచ్ఒ కామేశ్వర ప్రసాద్తో కలిసి విలేకరులతో మాట్లాడారు. మే 31వ తేదీ వరకు ఫస్ట్ డోస్ వ్యాక్సినేషన్ను నిలిపేసినట్లు చెప్పారు. ఈ నెల 11వ తేదీ మంగళవారం నుంచి జిల్లాలో సెకండ్ డోస్ వ్యాక్సినేషన్ కార్యక్రమం జరుగుతుందన్నారు. జూన్ 1వ తేదీనుంచి ఫస్ట్ డోస్ కావాలంటే స్లాట్ బుక్ చేసుకుని ఆన్లైన్లో ఫ్రీ రిజిస్ట్రేషన్ కోసం కోవిన్ పోర్టల్ లాగిన్ అయి ఓటీపీ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చన్నారు.
ఏ తేదీ, టైం, ఎక్కడ కావాలంటే అక్కడ ఫ్రీ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చన్నారు. సెకండ్ డోస్ వ్యాక్సినేషన్ వేసుకునే వారికి ఆశ వర్కర్లు, ఏఎన్ఎంలు ఏ సమయానికి ఎక్కడికి వెళ్లాలి అనేది స్లిప్లను అందజేస్తారని, వారికి కేటాయించిన సమయంలో మాత్రమే సెకండ్ డోస్ వ్యాక్సినేషన్ వేసుకునే వారు వారికి కేటాయించిన సెంటర్లకు వస్తే రద్దీ లేకుండా ఉంటుందన్నారు.ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటల వరకు సెకండ్ డోస్ వ్యాక్సినేషన్ వేయనున్నట్లు చెప్పారు. జిల్లాలో ఇప్పటివరకు 3.61 లక్షల మందికి వ్యాక్సినేషన్ వేసినట్లు చెప్పారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు కోవిడ్ నిబంధనలను తప్పనిసరిగా పాటిఇంచాలని సూచించారు. జిల్లాలో హోమ్ ఐసోలేషన్లో 11,300 మంది ఉన్నారని, 700 మంది కోవిడ్ కేర్ సెంటర్లలో, 2300 మంది ఆస్పత్రుల్లో ఉన్నారన్నారు.