ప్రజాశక్తి - పెద్దాపురం : 50 సంవత్సరాలు వయసు నిండిన భవన నిర్మాణ కార్మికులకు పింఛన్ ఇవ్వాలని పెద్దాపురం మండల ప్రైవేట్ ఎలక్ట్రికల్ వర్కర్స్ యూనియన్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది.
గురువారం స్థానిక యాసలపు సూర్యారావు భవనంలో ప్రైవేట్ ఎలక్ట్రికల్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు తాడిశెట్టి గంగాధర్ అధ్యక్షతన జరిగిన ఎలక్ట్రికల్ వర్కర్స్ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 40 సంవత్సరాలు వయసు దాటిన కార్మికులకు పనులు కల్పించడం లేదన్నారు. దీంతో వీరు పనులు లేక ఎన్నో అవస్థలు పడుతున్నారన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం నిర్మాణ రంగంలో 50 సంవత్సరాలు వయసు నిండిన అన్ని విభాగాల కార్మికులకు నెలకు రూ 5 వేలు పింఛన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలాగే భవన నిర్మాణ కార్మికుల సంక్షేమం కోసం ఏర్పడిన సంక్షేమ బోర్డును పూర్తిస్థాయిలో పునరుద్ధరించి భవన నిర్మాణ కార్మికులకు అన్ని రకాల సంక్షేమ పథకాలు అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. భవన నిర్మాణ కార్మికుల పెండింగ్ క్లయిములన్ని వెంటనే విడుదల చేయాలన్నారు. ఈ సమావేశంలో సంఘ నాయకులు పెదిరెడ్ల విష్ణు, కందిరెల్ల దుర్గాప్రసాద్, జోకా సూర్యనారాయణ, భూసారి శ్రీను, షేక్ ఇబ్రహీం, ఏ రమేష్, పినిశెట్టి సురేంద్ర, దాసరి శివలు పాల్గొన్నారు.

