న్యూఢిల్లీ : సాంకేతిక సమస్య కారణంగా అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లోకి ప్రవేశించే కామన్ ఎంట్రన్స్ టెస్ట్ సియుఇటి-యుజి పరీక్షలు శనివారం ఆలస్యంగా ప్రారంభమయ్యాయి.
దేశవ్యాప్తంగా పలు పరీక్షా కేంద్రాల్లో సాంకేతిక సమస్య తలెత్తిందని, దీంతో ఉదయం 9.00గంటలకు ప్రారంభం కావాల్సిన పరీక్ష రెండు గంటల ఆలస్యమైందని నేషనల్ టెస్టింగ్ ఏజన్సీ (ఎన్ టి ఎ ) పేర్కొంది. సమస్య పరిష్కారమైందని, ఏ అభ్యర్థికీ నష్టం కలగకుండా పరీక్షకు అదనపు సమయాన్ని కేటాయించామని తెలిపింది. ఉదయపు, మధ్యాహ్నపు సెషన్స్ అభ్యర్థులకు పరీక్షా పత్రం పూర్తి చేయడానికి అవసరమైన పూర్తి సమయం కేటాయించామని, వారు పరీక్ష పూర్తి చేసిన తర్వాతే బయటకు వెళ్లడానికి అనుమతి ఉంటుందని పేర్కొంది. అయితే టాటా కన్సల్టెన్సీ సర్వీస్ (ఎం/ఎస్ టిసిఎస్) కారణంగానే ఆలస్యమైందని నేషనల్ టెస్టింగ్ ఏజన్సీ (ఎన్ టి ఎ)ఆరోపించింది. పరీక్షలు ఆలస్యం కావడంపై అభ్యర్థులు, తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఈ ఏడాది CUET-UG పరీక్ష మే 11, 2026న ప్రారంభమై, మే 31, 2026 వరకు కొనసాగనుంది. ఈ పరీక్ష కోసం మొత్తం 15,68,866 మంది అభ్యర్థులు నమోదు చేసుకున్నారు. 21 రోజుల పాటు సాగే ఈ పరీక్షలను మొత్తం 35 విడతల్లో నిర్వహించనున్నారు.
దేశ విద్యావ్యవస్థను నాశనం చేసిన ప్రధాని : రాహుల్ గాంధీ
సియుఇటి-యుజి పరీక్ష ఆలస్యం కావడంపై లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశ విద్యావ్యవస్థను ప్రధాని మోడీ ధ్వంసం చేశారని మండిపడ్డారు. "నీట్, సిబిఎస్ఇ, ఎస్ఎస్ సి , ఈ రోజు సియుఇటి. నాలుగు పరీక్షలు కోటిమంది విద్యార్థులు, ఒక్క పరీక్షను కూడా విశ్వసనీయంగా నిర్వహించలేకపోయారు. తాము విశ్వగురువులమని గొప్పలు చెప్పుకుంటున్న ప్రభుత్వం కనీసం ఒక్క పరీక్షను కూడా సక్రమంగా నిర్వహించలేకపోయారు. ప్రధాని మోడీ మొత్తం విద్యావ్యవస్థనే నాశనం చేశారు. మీరు ఎవరి భవిష్యత్తునైతే నాశనం చేస్తున్నారో.. సరిగ్గా ఆ తరమే మిమ్మల్ని జవాబుదారీగా నిలబెడుతుంది" అని ఎక్స్ లో పేర్కొన్నారు.
అసమర్థతకు పరాకాష్ట : అతిషి
కేంద్రం అసమర్థతకు ఇది పరాకాష్ట అని ఢిల్లీ అసెంబ్లీ ప్రతిపక్ష నేత అతిషి విద్యాశాఖపై విరుచుకుపడ్డారు. ముందు నీట్, ఆ తర్వాత సిబిఎస్ఇ, ఇప్పుడు సియుఇటి… ఈ రోజు CUET పరీక్ష ఒక 'సాంకేతిక సమస్య' కారణంగా వాయిదా పడిందని పేర్కొన్నారు. ఈ రోజు దేశవ్యాప్తంగాత అన్ని ప్రాంతాల్లో లక్షలాది మంది విద్యార్థులు ఈ పరీక్ష రాయాల్సి ఉందని, గంటల తరబడి వేచి ఉన్న తర్వాత, అన్ని పరీక్షా కేంద్రాల బయట ఇటువంటి నోటీసులు అంటించారని, ఇది అసమర్థతకు పరాకాష్ట అని ఎక్స్ లో పోస్ట్ చేశారు. హ్యాష్ ట్యాగ్ గా ధర్మేంద్రప్రధాన్ పేరును జోడించారు.

