న్యూఢిల్లీ : ఈ నెలాఖరున అమెరికా విదేశాంగ మం త్రి మార్కో రూబియో భారత్ లో పర్యటించనున్నారు. క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశంలో పాల్గొనడానికి రూబియో వస్తున్నారు.
భారత్ తో ద్వైపాక్షిక చర్చల్లోనూ ఆయన పాల్గొననున్నారు. ఈ విషయాన్ని భారత్ లోని రాయబారి సెర్గియో గోర్ వెల్లడించారు. గత జనవరిలో అమెరికా విదేశాంగ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత రూబియో తొలిసారిగా మే 24 నుంచి 26 వరకు మూడు రోజుల పర్యటన నిమిత్తం భారత్ కు రానున్నారని గోర్ తెలిపారు. అలాగే, రాబోయే నెలల్లో పలువురు అమెరికా గవర్నర్లు భారత్ లో పర్యటించనున్నారని గోర్ ప్రకటించారు.
ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ తరంజిత్ సింగ్ సంధుతో సమావేశమైన తరువాత గోర్ ఈ వివరాలను సోషల్ మీడియాలో గురువారం వెల్లడించారు. ఈ నెల 26న జరిగే క్వాడ్ విదేశాంగ మం త్రుల సమావేశంలో జైశంకర్, రూబియోలతో పాటు పెన్నీ వాంగ్ (ఆస్ట్రేలియా), తోషిమిత్సు మొటెగీ (జపాన్) పాల్గొంటారు. తరువాత జైశంకర్, అజిత్ దోవల్లతో పాటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో కూడా రూబియో ద్వైపాక్షిక చర్చల్లో పాల్గొంటారు. భారత్, అమెరికా మధ్య ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం పురోగతిని కూడా రూబియో సమీక్షించే అవకాశం ఉంది.

