న్యూఢిల్లీ : రైతు సమస్యలపై మోడీ సర్కార్ వ్యవహరిస్తున్న తీరుపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ విరుచుకుపడ్డారు. మీరట్లో కిసాన్ మహాపంచాయత్లో మాట్లాడుతూ..కనీస మద్దతు ధర విషయంలో బిజెపి నేతలు, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్ అబద్ధాలు వల్లెవేస్తున్నారంటూ మండిపడ్డారు. రైతులకు కనీస మద్దతు ధరకు తాము కట్టుబడి ఉన్నామని, భవిష్యత్తులో దాన్ని కొనసాగిస్తామని పార్లమెంట్లో ప్రధాని మోడీ వ్యాఖ్యానించారని, ఉత్తరప్రదేశ్లో ఎంఎస్పి ఎక్కడ చెల్లిస్తున్నారంటూ కేజ్రీవాల్ ప్రశ్నించారు. బిజెపి మంత్రులు కూడా ఎంఎస్పి ఉంటుందని ఒకే పాట పాడుతున్నారరని, అయితే యుపిలోని మండిల్లోని రైతులు ఎంఎస్పి పొందారో సెలవివ్వండి అంటూ ప్రశ్నించారు.
యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం అబద్ధాలు చెబుతుందని విమర్శించారు. రాష్ట్రంలోని చెరుకు రైతులు బకాయిలు ఇంకా చెల్లించలేదని, రూ. 18 వేల కోట్లు బకాయి పడ్డారని, చక్కెర మిల్లు యాజమానుల సమస్యను పరిష్కరించడంలో యోగి సర్కార్ విఫలమైందని మండిపడ్డారు. చెరుకు రైతుల బకాయిల చెల్లింపులో భరోసా ఇవ్వలేకపోవడం... యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వానికి సిగ్గుచేటు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

