Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
బ్రెజిలియన్‌ గ్రూపులను ప్రపంచ ఉగ్రవాద గ్రూపులుగా ప్రకటించిన అమెరికా : ప్రశ్నించిన లూలా

బ్రెజిలియన్‌ గ్రూపులను ప్రపంచ ఉగ్రవాద గ్రూపులుగా ప్రకటించిన అమెరికా : ప్రశ్నించిన లూలా

బ్రెసిలియా : రెండు బ్రెజిలియన్‌ ముఠాలను అమెరికా ప్రపంచ ఉగ్రవాద గ్రూపులుగా గురువారం ప్రకటించింది. బ్రెజిల్‌కు చెందిన కమాండో వెర్మెల్హో (సివి), ప్రైమిరో కమాండో డా క్యాపిటల్ (పిసిసి) చర్యలు ప్రపంచ ఉగ్రవాద సంస్థల చర్యలను పోలి ఉన్నాయని..

అందుకే వీటిని ప్రపంచ ఉగ్రవాద (ఎస్‌డిజిటిలు) సంస్థలుగా పరిగణించడం జరుగుతుందని అమెరికా విదేశాంగ శాఖ గురువారం ప్రకటించింది. అయితే అమెరికా తీసుకున్న ఈ నిర్ణయాన్ని బ్రెజిల్‌ అధ్యక్షుడు లూలా డా సల్వా తిరస్కరించారు. అసలెందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారని అమెరికాను లూలా ప్రశ్నించారు.

కమాండో డా క్యాపిటల్‌, కమాండో వెర్మోల్హో ఈ రెండు గ్రూపులు బ్రెజిల్‌లో అత్యంత హింసాత్మక నేర సంస్థలు. ఈ రెండు సంస్థల ప్రభావం కేవలం ఒక్క ప్రాంతానికే పరిమితమై లేదు.. దేశవ్యాప్తంగా విస్తరించింది అని అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో అన్నారు. జూన్‌ 5 నుంచి ఈ రెండు గ్రూపులను విదేశీ ఉగ్రవాద సంస్థలు (ఎఫ్‌టిఓ)గా పరిగణించడం జరుగుతుందని మార్కో రూబియో తెలిపారు.

కాగా, మార్కో రూబియో ప్రకటనపై లూలా డా సల్వా స్పందించారు. మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వాటి సంబంధిత నేరాలకు వ్యతిరేకంగా చేస్తోన్న పోరాటానికి అమెరికా తీసుకున్న ఈ నిర్ణయం సమర్థవంతంగా దోహదపడదని లూలా ఎక్స్‌ పోస్టులో నొక్కి చెప్పారు. విదేశాంగ మంత్రి మార్కో రూబియో తీసుకున్న నిర్ణయాన్ని బట్టి చూస్తే.. బ్రెజిల్ భూభాగంలో అమెరికా చేపట్టబోయే చర్యలను సమర్థించుకునేందుకు తీసుకున్న వ్యూహంలో భాగంగా కనిపిస్తోంది. అంతర్జాతీయ మాదకద్రవ్యాల అక్రమ రవాణాను ఎదుర్కోవాలనే నెపంతో బ్రెజిల్‌లో సైనిక జోక్యం చేసుకోవాలని వాషింగ్టన్‌ను బ్రెజిల్‌ మితవాద నాయకుడు బోల్సోనారో కోరుతున్నారు. ఆయన ఆ అవకాశాన్ని కూడా బహిరంగంగా ప్రచారం చేస్తున్నారని బ్రెజిల్‌ అధ్యక్షుడు లూలా విమర్శించారు.

​కాగా, సివి, పిసిసి గ్రూపులను అమెరికా ప్రపంచ ఉగ్రవాద సంస్థలుగా ప్రకటించడంపై బ్రెజిల్‌ అధ్యక్షుడు ఓ ప్రకటన విడుదల చేశారు. బ్రెజిల్‌ ఒక సార్వభౌమాధికార దేశం. లక్షలాది కుటుంబాలు నివశిస్తున్న ప్రాంతాల్లో నేరపూరిత సంస్థలైన పిసిసి, సివి గ్రూపులు చేస్తున్న ఉగ్రవాద కార్యకలాపాలకు వ్యతిరేకంగా బ్రెజిల్‌ నిరంతరం పోరాడుతుంది. ఈ సంస్థలు నేరాల ద్వారా, మాదకద్రవ్యాలు, ఆయుధాల అక్రమణ రవాణా ద్వారా ఆర్థిక ప్రయోజనాలు పొందడమే లక్ష్యంగా పెట్టుకుంటాయి. అలాంటి ఈ సంస్థల్ని అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థలతో పోల్చకూడదు. ఎందుకంటే సైద్ధాంతిక, రాజకీయ, మతపరంగా అంతర్జాతీయ ఉగ్రవాదంతో ముడిపడి ఉండే ఆ సంస్థల చర్యలతో.. బ్రెజిల్‌ సివి, పిసిసి గ్రూపులను పొరపాటున కూడా చేర్చకూడదు లూలా తన ప్రకటనలో స్పష్టం చేశారు. అలాగే పన్నుల పెంపు విషయంలాగాగానే.. బ్రెజిల్లో అమెరికా జోక్యాన్ని పెంచడానికి ఆ విధమైన చర్యలుగా.. బొల్సొనారో కుటుంబం అమెరికాకు వెళ్లింది అని లూలా ప్రకటనలో ఆరోపించారు. బ్రెజిల్‌ వ్యవస్థీకృత నేరాలకు వ్యతిరేకంగా పోరాడుతోందని ఆయన ప్రకటనలో పేర్కొన్నారు. ఏప్రిల్ లో లూలా అమెరికాలో పర్యటించారు. మే నెలలోనే అమెరికా నుంచి ఇలాంటి నిర్ణయం రావడం గమనార్హం.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: prajasakti