న్యూఢిల్లీ : చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సిడిఎస్) జనరల్ అనిల్ చౌహాన్ శనివారం పదవీ విరమణ చేశారు. ఆయన పదవీకాలం నేటితో ముగిసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
ఆయన తర్వాత తదుపరి కొత్త చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సిడిఎస్)గా లెఫ్టినెంట్ జనరల్ ఎన్.ఎస్. రాజా సుబ్రమణి మే 31న పదవీ బాధ్యతలు స్వీకరించనున్నట్లు ఆ వర్గాలు తెలిపాయి. ఆయన నియామకానికి సంబంధించి కేంద్రం ఇప్పటికే అధికారిక ఉత్తర్వులు జారీ చేసినట్లు పేర్కొన్నాయి. ఆర్మీ, నేవీ, ఎయిర్ఫోర్స్ లను ఒక్కతాటిపైకి తెస్తూ రక్షణ రంగాన్ని బలోపేతం చేయడంలో జనరల్ చౌహాన్ కీలక పాత్ర పోషించారని తెలిపాయి.
దేశ రక్షణ కోసం ప్రాణాలర్పించిన అమరవీరులకు జాతీయ యుద్ధ స్మారకం వద్ద జనరల్ అనిల్ చౌహాన్ నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సుమారు నాలుగేళ్ల పదవీ కాలం తనకు 'ఎంతో సంతృప్తిని' ఇచ్చిందని అన్నారు. త్రివిధ దళాల గౌరవ వందనంతో సైనిక సేవ నుండి పౌర జీవితంలోకి అడుగుపెట్టడం తనకు దక్కిన గొప్ప గౌరవంగా భావిస్తున్నట్లు ఆయన తెలిపారు.
తదుపరి కొత్త చీఫ్ ఆఫ్ స్టాఫ్ గా బాధ్యతలు చేపట్టనున్న లెఫ్టినెంట్ జనరల్ ఎన్.ఎస్. రాజా సుబ్రమణి కి దాదాపు 40 ఏళ్లకు పైగా సుదీర్ఘ సైనిక అనుభవం ఉంది. గతంలో ఆర్మీ వైస్ చీఫ్గా, సెంట్రల్ కమాండ్ జనరల్ ఆఫీసర్ కమాండింగ్-ఇన్-చీఫ్గా, జాతీయ భద్రతా మండలి సెక్రటేరియట్లో సైనిక సలహాదారుగా పలు కీలక బాధ్యతలను విజయవంతంగా నిర్వహించారు. ఆయన పదవీ బాధ్యతలు స్వీకరించినప్పటి నుండి రక్షణ శాఖలోని మిలిటరీ వ్యవహారాల విభాగానికి కార్యదర్శిగా కూడా వ్యవహరించనున్నారు.

