న్యూఢిల్లీ : దేశ రాజధాని నగరం న్యూఢిల్లీలోని వివేక్ విహార్ ప్రాంతంలో ఒక భవనంలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ విషాద ఘటనలో నవజాత శిశువు సహా 9 మంది సజీవదహనమయ్యారు.
మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. వివేక్ విహార్ ప్రాంతంలో షహదారాలోని నాలుగంతస్తుల భవనంలో ఆదివారం వేకువ ఝామున 3.30 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది . ఘటనపై సమాచారం అందుకున్న సహాయక బృందాలు దాదాపు 15 మందిని రక్షించాయి.
భవనంలోని ఎయిర్ కండీషన్ (ఎసి) పేలడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు చెబుతున్నారు. తొలుత రెండో అంతస్తులో మొదలైన మంటలు తర్వాత మూడు, నాలుగు అంతస్తులకు వ్యాపించాయి. సమాచారం అందుకున్న వెంటనే 14 అగ్నిమాపక దళాలు అక్కడకు చేరుకొని సహాయక చర్యలు చేపట్టాయి. స్థానికుల సహాకారంతో మంటల్లో చిక్కుకున్న 15 మందిని రక్షించారు.
క్షతగాత్రులను సమీపంలోని ఆసుప్రతికి తరలించారు. అగ్నిప్రమాదం జరిగిన తర్వాత బాధితులు తప్పించుకోవడానికి అవకాశాలు తగ్గిపోయాయి. నాలుగంతస్తుల బిల్డింగ్ అయినప్పటికీ, ఒకటే మెట్ల మార్గం ఉంది. ఒకటే లిఫ్ట్ ఉంది.
దీంతో ఈ మార్గాలు మూసుకుపోవడం వల్ల బాధితులు చిక్కుకుపోయారు. ఇక రెండో ఫ్లోర్లో అగ్నిప్రమాదం కారణంగా షార్ట్ సర్క్యూట్ ఏర్పడింది. దీంతో స్మార్ట్ లాక్ ఉన్న డోర్లు మూసుకుపోయాయి. దీంతో ఆ ఫ్లోర్లోని బాధితులంతా గదుల్లోనే చిక్కుకుపోయారు.
తర్వాత అందులోని వారి మృతదేహాల్ని సహాయక బృందాలు బయటకు తీశాయి. మంటలు చెలరేగడంతో అక్కడి వారు మేడ పైకి వెళ్లేందుకు ప్రయత్నించినా సాధ్యం కాలేదు. పైన డోర్లు మూసుకుపోయాయి. బాల్కనీ కూడా మూసి ఉంది.
దీంతో బాధితులకు ఎటు వెళ్లాలో తెలియని పరిస్థితి నెలకొంది. బాధితులు ముందుగా పొగ ప్రభావానికి గురై కిందపడిపోగా, తర్వాత మంటలకు దగ్ధమయ్యారు. తొలి అంతస్తులో తలుపులు మూసుకుపోవడం వల్ల మరొకరు మరణించినట్లు తెలుస్తోంది. భద్రతా నియమాలు పాటించకపోవడం వల్లే మృతుల సంఖ్య పెరిగినట్లు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విచారం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు సానుభూతి తెలిపారు. మృతుల కుటుంబాలకు రూ.4 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు.

