Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Ebola : అమెరికా ప్రయాణ ఆంక్షలు.. వీసాల నిలిపివేత

Ebola : అమెరికా ప్రయాణ ఆంక్షలు.. వీసాల నిలిపివేత

వాషింగ్టన్: ఎబోలా వ్యాప్తిని నివారించడానికి ముందుజాగ్రత్త చర్యలను బలోపేతం చేస్తున్నట్లు అమెరికా ప్రకటించింది. దీనిలో భాగంగా వ్యాధి వ్యాప్తి చెందిన ఆఫ్రికా ప్రాంతాల నుండి వచ్చే విమాన ప్రయాణికులను పరీక్షించడంతో పాటు, వీసాలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు అమెరికా రాయబార కార్యాలయం వెల్లడించింది.

డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో (డి ఆర్ సి) లో ప్రాణాంతకమైన ఎబోలా వ్యాప్తిని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యు హెచ్ ఒ) అత్యవసర పరిస్థితిగా ప్రకటించిన నేపథ్యంలో, యుఎస్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సిడిసి) ఈ నివారణ చర్యలను చేపట్టింది. విమానాశ్రయాలలో స్క్రీనింగ్‌తో పాటు, గత 21 రోజులలోపు ఉగాండా, డి ఆర్ సి, దక్షిణ సూడాన్‌లకు ప్రయాణించిన అమెరికా యేతర పాస్‌పోర్ట్ హోల్డర్లపై ప్రవేశ ఆంక్షలను అమలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఉగాండాలోని కంపాలాలో ఉన్న అమెరికా రాయబార కార్యాలయం అన్ని వీసా సేవలను తాత్కాలికంగా నిలిపివేసి, ప్రభావితమైన దరఖాస్తుదారులకు సమాచారం అందించింది.

డి ఆర్ సి లో ఉన్న ఒక అమెరికన్ సిబ్బందికి ఎబోలా వైరస్ సోకినట్లు డబ్ల్యుహెచ్ ఒ ప్రతినిధి సతీష్ పిళ్ళై ధృవీకరించారు. ఆ వ్యక్తికి పరీక్షల్లో పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో, చికిత్స నిమిత్తం జర్మనీకి తరలించేందుకు యత్నిస్తున్నామని అన్నారు. అలాగే అతనితో పరిచయం ఉన్న మరో ఆరుగురిని క్వారంటైన్‌కు తరలించినట్లు తెలిపారు. ప్రస్తుతం ప్రజలకు తక్షణ ప్రమాదం తక్కువగానే ఉందని అంచనా వేస్తున్నామని, అయితే మారుతున్న పరిస్థితులను నిరంతరం సమీక్షిస్తున్నట్లు సిడిసి తెలిపింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ఈ వ్యాధి వ్యాప్తిపై ఆందోళన వ్యక్తం చేస్తూనే, ప్రస్తుతానికి ఇది ఆఫ్రికాకే పరిమితమైందని తాను భావిస్తున్నట్లు పేర్కొన్నారు.

అంతర్జాతీయంగా వెల్లువెత్తుతున్న విమర్శలు
అయితే, ఈ ఎబోలా సంక్షోభంపై ట్రంప్ ప్రభుత్వం స్పందిస్తున్న తీరుపై అంతర్జాతీయంగా తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అమెరికా ఈ ఏడాది ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్ ఒ) నుండి అధికారికంగా వైదొలగడం, మరియు గతంలో ఎబోలా నివారణలో కీలక పాత్ర పోషించిన 'యుఎస్ ఎఐడి' (యుఎస్ ఎఐడి) నిధులలో కోత విధించడం ప్రస్తుత నియంత్రణ ప్రయత్నాలపై ప్రతికూల ప్రభావం చూపిందనే ఆరోపణలు వస్తున్నాయి. ప్రస్తుతం తీసుకుంటున్న ప్రయాణ నిషేధాలు కేవలం నాటకమేనని, ట్రంప్ ప్రభుత్వం ఈ విషయంలో చాలా వెనుకబడి వ్యవహరిస్తోందని జార్జ్‌టౌన్ యూనివర్శిటీ నిపుణులు మాథ్యూ కావనాగ్ విమర్శించారు. గతంలో ప్రభుత్వ ఏజెన్సీల సమన్వయం వల్ల వ్యాధిని వేగంగా అరికట్టగలిగారని, కానీ ఇప్పుడు వందలాది కేసులు నమోదై, తీవ్రంగా వ్యాపించిన తర్వాతే చర్యలు చేపట్టడం అమెరికా వ్యూహాత్మక వైఫల్యమని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. తాము స్థానిక ఆరోగ్య సంస్థలతో కలిసి పనిచేస్తున్నామని, తక్షణ ప్రతిస్పందన చర్యల కోసం 13 మిలియన్ డాలర్ల సహాయాన్ని సమీకరించినట్లు సిడిసి ప్రకటించింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: prajasakti