న్యూఢిల్లీ : ఈ ఏడాది కూడా ఢిల్లీలో దీపావళి పండుగ ఉత్సాహం లేనట్లే. టపాసులు స్టోరేజ్ చేయడం కానీ, కొనుగోలు, అమ్మకం, వినియోగం వంటి వాటిపై ఆప్ ప్రభుత్వం నిషేధం విధించింది.
ఈ మేరకు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. 'గత మూడు సంవత్సరాలుగా దీపావళి సమయంలో పెరుగుతున్న ప్రమాదకరమైన కాలుష్య స్థాయిలను పరిగణనలోకి తీసుకుని.. ఈ సంవత్సరం టపాసులు నిల్వ, అమ్మకం, వినియోగంపై నిషేధం విధిస్తున్నాం' అని ట్వీట్ చేశారు. గత ఏడాది కూడా ప్రభుత్వం టపాసులపై నిషేధం విధించింది. 2020లో బాణా సంచాపై నిషేధాన్ని విధిస్తూ ప్రభుత్వం ఆలస్యంగా ప్రకటన చేయడంతో వ్యాపారులకు నష్టం వాటిల్లింది. ఢిల్లీలో కాలుష్య స్థాయిలో దీపావళి తర్వాత అమాంతం పెరిగిపోతుండటంతో కేజ్రీవాల్ ఈ నిర్ణయం తీసుకున్నారు.

