Dailyhunt
గోతిలో పడిన వ్యవసాయ కూలీల ట్రాక్టర్

గోతిలో పడిన వ్యవసాయ కూలీల ట్రాక్టర్

- పలువురు కూలీలకు గాయాలు ప్రజాశక్తి - ప్రత్తిపాడు : మండలంలోని వంగిపురం గ్రామ పరిధిలో శనివారం ఉదయం జరిగిన ఒక ప్రమాదంలో మిరప కోతకు వెళ్తున్న వ్యవసాయ కూలీలు గాయపడ్డారు.

గ్రామస్తులు మరియు బాధితులు తెలిపిన వివరాల ప్రకారం..
రాయపాడు - వంగిపురం గ్రామాల మధ్య గల పొలిమేర డొంక రోడ్డులో మల్లయ పాలెంకు చెందిన ఒక రైతు పొలంలో మిరప కోత పనుల కోసం 25 మంది కూలీలు ట్రాక్టర్ ట్రక్కులో బయలుదేరారు. ప్రయాణ మధ్యలో రోడ్డుపై ఉన్న ఒక పెద్ద గోతిలో ట్రాక్టర్ వెనుక చక్రం పడటంతో ఒక్కసారిగా వాహనం పక్కకు ఒరిగిపోయింది. ఈ క్రమంలో ట్రక్కులో ఉన్న కూలీలందరూ ఒకరిపై ఒకరు పడటంతో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే గమనించిన స్థానిక గ్రామస్తులు అప్రమత్తమై, వెంటనే వంగిపురం సర్పంచ్ కారులో క్షతగాత్రులను ప్రత్తిపాడు సామాజిక ఆరోగ్య కేంద్రానికి (CHC) తరలించారు.
ఆసుపత్రి సూపర్నెంట్ డాక్టర్ ప్రవీణ్ కుమార్ పర్యవేక్షణలో వైద్య బృందం వెంటనే బాధితులకు అత్యవసర చికిత్స అందించారు. మొత్తం 6గురికి మాత్రమే గాయాలు ఎటువంటి ప్రాణాపాయం లేదని, ప్రస్తుతం అందరికీ అవసరమైన వైద్య సేవలు అందుతున్నాయని వైద్యులు వెల్లడించారు. పొలిమేర డొంక రోడ్లు అధ్వానంగా ఉండటం వల్లే ఇటువంటి ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: prajasakti