- చరిత్రలో లేని విధంగా కమర్షియల్ గ్యాస్ ధర పెంపు
- ఏపీ హోటల్స్ అసోసియేషన్
ప్రజాశక్తి-విజయనగరం కోట : కేంద్ర ప్రభుత్వం, జాతీయ ఆయిల్ కంపెనీలు మే 1 నుంచి వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరలను భారీగా పెంచడం హోటల్ రంగానికి పెను ప్రమాదంగా మారిందని ఆంధ్రప్రదేశ్ హోటల్స్ అసోసియేషన్ అధ్యక్షులు జి.
శ్రీనివాసరావు ఆందోళన వ్యక్తం చేశారు. శనివారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరలు, సిబ్బంది జీతాలు పెరగడం, గ్యాస్ సరఫరా సక్రమంగా లేకపోవడం వల్ల హోటల్ రంగం క్లిష్ట పరిస్థితుల్లో ఉందన్నారు. ఈ పరిస్థితుల్లో ఒక్కో వాణిజ్య సిలిండర్పై భారీగా 993/- ధరలు పెంచడం తీవ్ర అన్యాయమని విమర్శించారు.
మార్చి 1 నుంచి మే 1 వరకు ఒక్కో సిలిండర్పై రూ.1,320 వరకు పెరుగుదల నమోదైందని, ఇది సుమారు 81 శాతం పెంపు అని తెలిపారు. ఈ రంగంపై లక్షలాది మంది కార్మికులు, యాజమాన్య కుటుంబాలు ఆధారపడి ఉన్నాయని గుర్తు చేశారు.
ధరలు పెంచితే వినియోగదారులు హోటళ్లకు రావడం తగ్గిపోతుందని, పెంచకపోతే యజమానులు నష్టాల్లో కూరుకుపోతారని పేర్కొన్నారు. దీంతో హోటళ్లు మూతపడే ప్రమాదం ఉందని హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వం, ఆయిల్ కంపెనీలు వెంటనే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని, పన్నులు తగ్గించి పాత రేట్లకే వాణిజ్య సిలిండర్లు సరఫరా చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడులకు విజ్ఞప్తి చేస్తున్నామని తెలిపారు.

