కేప్ టౌన్ : అత్యంత అరుదైన హంటా వైరస్ వెలుగు చూడటంతో క్రూయిజ్ నౌకలో నడిసంద్రంలో నిలిచింది. ఈ వ్యాధితో నౌకలో ఇప్పటికే ముగ్గురు ప్రయాణికులు మరణించగా, మరో ముగ్గురు తీవ్ర అస్వస్థతకు గురయ్యారని నౌక నిర్వాహకులు తెలిపారు.
అట్లాంటిక్ మహాసముద్రంలోని కేప్ వేర్డ్ తీరంలో ఈ నౌక సహాయం కోసం వేచి చూస్తోందని పేర్కొన్నారు.
వివరాల ప్రకారం.. డచ్ నౌక ఎంవిహోండియస్ సుమారు 150మంది ప్రయాణికులతో అర్జెంటీనా నుండి అంటార్కిటికా , దక్షిణ అట్లాంటిక్ లోని పలు ద్వీపాలకు వారం రోజుల పాటు ప్రయాణించాల్సి వుంది. అయితే ఈ నౌకలోని ప్రయాణికులు అరుదైన హంటా వైరస్ బారిన పడ్డారు. దీంతో పశ్చిమ ఆఫ్రికా తీరంలోని కేప్ వేర్డ్ ద్వీపానికి చేరుకుని స్థానిక ఆరోగ్య అధికారుల నుండి సహాయం కోరింది. అయితే ప్రయాణికులు దిగేందుకు అనుమతించలేదని నెదర్లాండ్స్ ఆధారిత ఆపరేషన్ ఓషన్ వైడ్ ఎక్స్ పెడిషన్స్ సోమవారం తెలిపింది. ప్రజారోగ్యం దృష్ట్యా ప్రస్తుతానికి ఆ నౌకను రేవులో నిలిపేందుకు అనుమతించబోమని, తీరానికి దగ్గరగా బహిరంగ జలాల్లోనే ఉంటుందని కేప్ వేర్డ్ ఆరోగ్య శాఖ వెల్లడించింది.
హంటా వైరస్ ఎలుకల ద్వారా వ్యాపించే ఒక వ్యాధి. ఇది ఒకరి నుండి మరొకరికి వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్ఒ) ఒక ప్రకటనలో పేర్కొంది. ఇది నౌకలో ఎలా వ్యాప్తి చెందిదో తెలియరాలేదని తెలిపింది. దీనిపై దర్యాప్తు చేస్తున్నామని అన్నారు. ఇద్దరు వైద్యులు, ఒక నర్సు , టెక్నీషియన్ తో కూడిన వైద్య బృందాన్ని మూడు విడతలలో ఓడ వద్దకు పంపినట్లు కేప్ వెర్డేలోని WHO అధికారి డాక్టర్ ఆన్ లిండ్స్ట్రాండ్ తెలిపారు. ప్రయాణికులను అంబులెన్స్ ద్వారా ఓడ నుండి విమానాశ్రయానికి తరలించేందుకు యత్నిస్తున్నామని అన్నారు. ఒకవేళ ప్రయాణికులను తరలించలేకపోతే, స్పెయిన్ దీవులలో ఒకటైన టెనెరిఫ్ లేదా లాస్ పాల్మాస్ ఓడరేవుకు తరలించే ప్రయత్నం చేస్తామని అన్నారు.

