తమిళనాడు : తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త అధ్యాయం మొదలైంది. సినీ నటుడు విజయ్ స్థాపించిన తమిళగ వెట్రి కళగం పార్టీ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్లో ఊహించని రీతిలో దూసుకుపోతోంది.
రాష్ట్రంలోని మొత్తం 234 స్థానాలకు గానూ, ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం టీవీకే ఏకంగా 110 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఈ రాజకీయ సంచలనంపై విజయ్ తండ్రి, దిగ్గజ దర్శకుడు ఎస్ఏ చంద్రశేఖర్ చెన్నైలో మీడియాతో మాట్లాడుతూ …. అత్యంత భావోద్వేగానికి గురయ్యారు. తన కుమారుడు విజయ్ రాజకీయ ప్రస్థానం గురించి చంద్రశేఖర్ మాట్లాడుతూ ….
"ఒక తండ్రిగా నేను ఇప్పుడు చాలా గర్వంగా, సంతోషంగా ఉన్నాను. నా కుమారుడికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. గత రెండేళ్లుగా విజయ్లో కనిపిస్తున్న ఆత్మ విశ్వాసం నన్ను ఆశ్చర్యపరిచింది. ఏదో ఒక రోజు తమిళనాడు ముఖ్యమంత్రి అవుతాననే బలమైన నమ్మకం అతడిలో ఉంది.
ఆ పట్టుదలే ఈరోజు విజయ్ను ఈ స్థాయికి చేర్చింది. ఆ ధైర్యాన్ని, వైఖరిని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఒక నాయకుడిగా విజయ్ చూపిన ధైర్యం సామాన్యమైనది కాదు. ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోకుండా, తన కాళ్ల మీద తాను నిలబడతానని చెప్పడం ఆయన తెగువకు నిదర్శనం. పొత్తులు లేకుండా బరిలోకి దిగి ఇంతటి ఆదరణ దక్కించుకోవడం అనేది నిజంగా ఒక చారిత్రక విజయం. ఇది విజయ్ సాధించిన అద్భుతమైన గెలుపు" అని చెప్పారు.

