విజయనగరం : జిల్లాలోని జంఝావతి ప్రాజెక్టు వివాదాన్ని ఒడిశా ప్రభుత్వంతో చర్చించి పూర్తి చేయాలని ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక ప్రధాన కార్యదర్శి అజశర్మ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని కోరారు. శ్రీకాకుళం జిల్లా వంశధార నదిపై నేరడి ప్రాజెక్టు నిర్మాణంపై ఒడిశా ముఖ్యమంత్రికి ఎపి సిఎం లేఖ రాయడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఇందులో భాగంగా విజయనగరం జిల్లా కొమరాడ మండలం వద్ద 1976లో మొదలైన జంఝావతి ప్రాజెక్టు ఒడిశాతో వివాదం వల్ల ఇప్పటికీ పూర్తి కాలేదన్నారు. సుమారు 10టిఎంసిల నీరు లభ్యమయ్యే ఈ ప్రాజెక్టు గురించి ఒడిశా ప్రభుత్వంతో చర్చించాలని కోరారు. గత ప్రభుత్వం మాదిరిగా కాకుండా ప్రాజెక్టు పూర్తయ్యే వరకూ అవసరమైన నిధులు కేటాయించి పట్టుదలతో పూర్తి చేయాలని ఆయన కోరారు.
ఉత్తరాంధ్రలోనే అతి పెద్ద నది అయిన వంశధార శ్రీకాకుళం జిల్లాకు జీవనాడి వంటిందన్నారు. ఒడిశా ప్రభుత్వంతో 1962లో చేసుకున్న ఒప్పందం ప్రకారం 115 టిఎంసిల్లో మనకు లభించేది 57.5 టిఎంసిల నీరని పేర్కొన్నారు. ఇందులో గొట్టాబ్యారేజీ ద్వారా ప్రస్తుతం మనం వాడుకుంటున్నది కేవలం 17.841 టిఎంసిలు మాత్రమేనన్నారు. మిగిలిన నీరంతా సముద్రంలో వృథాగా కలిసిపోతుం దన్నారు. నేరడి ప్రాజెక్టు నిర్మాణానికి 2002లో రూ.933కోట్లు ప్రతిపాదించారని, ఒడిశా ప్రభుత్వం లేవనెత్తిన చిన్న అభ్యంతరాల వల్ల ఇది నేటికీ పూర్తి కాలేదన్నారు. ఇప్పటికైనా ఇరువురు ముఖ్యమంత్రి చర్చించి జంఝావతి, నేరడి బ్రిడ్జి నిర్మాణాలను పూర్తిచేయాలని కోరారు.

