విజయనగరం : జిల్లాలోని జంఝావతి ప్రాజెక్టు వివాదాన్ని ఒడిశా ప్రభుత్వంతో చర్చించి పూర్తి చేయాలని ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక ప్రధాన కార్యదర్శి అజశర్మ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని కోరారు. శ్రీకాకుళం జిల్లా వంశధార నదిపై నేరడి ప్రాజెక్టు నిర్మాణంపై ఒడిశా ముఖ్యమంత్రికి ఎపి సిఎం లేఖ రాయడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఇందులో భాగంగా విజయనగరం జిల్లా కొమరాడ మండలం వద్ద 1976లో మొదలైన జంఝావతి ప్రాజెక్టు ఒడిశాతో వివాదం వల్ల ఇప్పటికీ పూర్తి కాలేదన్నారు. సుమారు 10టిఎంసిల నీరు లభ్యమయ్యే ఈ ప్రాజెక్టు గురించి ఒడిశా ప్రభుత్వంతో చర్చించాలని కోరారు. గత ప్రభుత్వం మాదిరిగా కాకుండా ప్రాజెక్టు పూర్తయ్యే వరకూ అవసరమైన నిధులు కేటాయించి పట్టుదలతో పూర్తి చేయాలని ఆయన కోరారు.

