
హైదరాబాద్ : ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న మహమ్మారి కరోనా వైరస్(కోవిడ్19) అన్ని రంగాలపై తీవ్రమైన ప్రభావం చూపుతోంది. అయితే పేద సినీ కార్మికుల కోసం టాలీవుడ్ ప్రముఖులు తమ వంతు సాయాన్ని ప్రకటిస్తున్నారు. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి పేద సినీ కార్మికుల కోసం రూ. కోటి విరాళం ఇవ్వగా.. సూపర్ స్టార్ మహేశ్ బాబు రూ. 25 లక్షలు ప్రకటించి తమ వంతు బాధ్యతను నిర్వర్తించారు.
తాజాగా టాలీవుడ్ కింగ్ నాగార్జున సైతం తెలుగు చలనచిత్ర పరిశ్రమలో(టీఎఫ్ఐ)ని రోజువారి కూలీలకు, అలాగే తక్కువ సంపాదన ఉన్న వాళ్లకు తన వంతు సాయంగా రూ. కోటి విరాళం ప్రకటించారు. ఈ మొత్తాన్ని టీఎఫ్ఐకి అందించారు. 'ప్రస్తుతం లాక్డౌన్ అనేది అవసరం.
కరోనా వ్యాప్తిని నిరోధించాలంటే లాక్డౌన్ అవసరం. లాక్డౌన్ పాటిస్తున్న వారికి.. మద్దతుగా నిలుస్తున్న వారికి నా అభినందనలు. ఈ కష్టకాలంలో ప్రభుత్వానికి అండగా నిలుస్తున్న వారికి కూడా ధన్యవాదాలు.
ఈ సమయంలో పేద సినీ కార్మికుల కోసం నా వంతుగా రూ. కోటి రూపాయలు విరాళంగా ప్రకటిస్తునన్నా. దేవుడు మనలను చల్లగా చూస్తాడు.. ఇంట్లోనే ఉండండి సురక్షితంగా ఉండండి'అంటూ నాగార్జున పేర్కొన్నారు.