న్యూఢిల్లీ : పరీక్షలకు సంబంధించిన లోపాలు, లొసుగుల విషయమై కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని కోరుతూ శాంతియుతంగా నిరసన చేపట్టడానికి ఈ నెల 6న భారత్కు వస్తున్నట్లు కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే తెలిపారు.
ఈ మేరకు ఆయన ఇన్స్టాగ్రామ్లో సోమవారం ఒక వీడియో విడుదల చేశారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద చేపట్టే ఈ నిరసనలో పాల్గొనాల్సిందిగా మద్దతు దారులకు, విద్యార్ధులకు ఆయన పిలుపు నిచ్చారు. ''భారత రాజ్యాంగం బాటను అనుసరిస్తూ, మనందరం ఒక తాటిపైకి వచ్చే సమయం ఆసన్నమైంది. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను డిమాండ్ చేస్తూ శాంతియుతంగా మన గళాలు వినిపించాలి.
మన వాణిని వినిపిస్తే, కచ్చితంగా వారు వింటారు.'' అని ఆయన అన్నారు. శనివారం ఉదయం అందరూ విమానాశ్రయం దగ్గరకు వస్తే అక్కడ నుండి పార్లమెంట్ స్ట్రీట్ పోలీసు స్టేషన్ వరకు ప్రదర్శనగా వెళ్లి, జంతర్ మంతర్ వద్ద శాంతియుత నిరసన నిర్వహించేందుకు అనుమతి కోరదామని చెప్పారు. పరీక్షలకు సంబంధించిన వివాదాలు, అంతరాయాలు, అడ్డంకులు ఇవన్నీ విద్యార్ధులను తీవ్రంగా ఆం దోళనకు గురి చేస్తున్నాయన్నారు. ప్రభుత్వం జవాబుదారీతనంతో వ్యవహరించాలని కోరారు.

