ప్రజాశక్తి-నిమ్మనపల్లె:
కరోన కష్టకాలంలో ఆమెకు ఏకష్టమొచ్చిందో ఏమో గాని ఓ వృద్ధురాలు ఇల్లువదిలి బయటకు వచ్చేసింది. కట్టుకున్నవాడు తొడులేకపోయాడు. ఆమె వద్ద ఉన్న ఫోన్ స్విచ్ ఆఫ్ కావడంతో ఇతర సమాచారం అందలేదు. దిక్కుతోచనిస్థితిలో రోడ్డుప్రక్కన శనివారం రాత్రంతా గడిపింది. దీనస్థితిలో రోడ్డుప్రక్కన ఉన్న వృద్ధురాలి సమాచారం స్థానికుల ద్వారా అందుకున్న ప్రజాశక్తి విలేఖరి తక్షణం పోలీసులు సహాయంతో ఆమెను వారి ఇంటికి పంపించి మానవత్వం చాటుకున్నారు. వివరాల్లోకి వెళ్లితే... వృద్ధురాలు తెలిపిన వివరాల మేరకు... మదనపల్లిలోని నిమ్మనపల్లి సర్కిల్ (వినాయక గుడి సమీపం) వద్ద దిగువకమ్మ వీధికి చెందిన విరప్పరెడ్డి భార్య మాడికొండ.
కాంతమ్మ(70) రెండు రోజుల క్రితం సమీప బంధువుల ఇంటిని వెతుక్కొంటూ నిమ్మనపల్లి మండలంలోని వలసపల్లి వద్దకు చేరుకొంది. అయితే ఏమైందోగాని వలసపల్లిలోని ఆమె బంధువుల ఇంటికి వెళ్లలేక మదనపల్లికి పోలేక కొమ్మిరెడ్డిగారిపల్లి వద్ద రోడ్డుపై ఓ రాత్రి పగలు పస్తులతో ఉండాల్సి వచ్చింది. ఆమె భర్త కూడా ఆమెను వదిలేసినట్లు తెలిపారు. కరోన వ్యాపిస్తున్న ప్రస్తుత తరుణంలో ఆమెను ఎవ్వరు పట్టించుకోలేదు. పస్తులతో ఉన్న ఆమెకు పల్లిలోని కొంతమంది శనివారం రాత్రి నీరు, భోజనం అందించారు. ఆదివారం ఉదయం ఆమె రోడ్డు ప్రక్కనే దినస్థితిలో, నీరసంగా ఉండడంతో స్థానికులు ప్రజాశక్తి విలేఖరి గురుప్రసాద్ కు సమాచారం అందించడంతో విలేఖరి ఏ.ఎస్సై సురేంద్ర కుమార్, కానిస్టేబుల్ రాజేష్ లతో కలిసి వృద్ధురాలి వద్దకు చేరుకొని ఆమె సమస్యను తెలుసుకొని ఆమెను తిరిగి మాదనపల్లికి పంపించి మానవత్వం చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో ఏఎస్సై సురేంద్ర కుమార్, కానిస్టేబుల్ రాజేష్, ప్రజాశక్తి విలేకరి గురుప్రసాద్ పాల్గొన్నారు.

